హనుమకొండ కొత్త కలెక్టర్ గా స్నేహా శబరీశ్

హనుమకొండ కొత్త కలెక్టర్ గా స్నేహా శబరీశ్
  • జీడబ్ల్యూఎంసీ కమిషనర్ గా చాహత్ బాజ్ పాయ్ నియామకం

హనుమకొండ, వెలుగు: హనుమకొండ జిల్లా కొత్త కలెక్టర్ గా స్నేహా శబరీశ్ నియామకమయ్యారు. 2017 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన ఆమె జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ గా పని చేస్తుండగా, గురువారం సాయంత్రం ప్రభుత్వం చేసిన బదిలీల్లో హనుమకొండ కలెక్టర్ గా ట్రాన్స్ ఫర్ అయ్యారు. ఆమె గతంలో ఖమ్మం అడిషనల్ కలెక్టర్ గా కూడా పని చేశారు. ఆ తర్వాత జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ గా విధుల్లో చేరగా, 2024 మార్చిలో ఆసిఫాబాద్  కలెక్టర్ గా పోస్టింగ్ ఇచ్చారు. ఆ తర్వాత ఒక్కరోజులోనే మళ్లీ జీహెచ్ఎంసీకి ట్రాన్స్ ఫర్ చేశారు.

ఇప్పుడు మరోసారి హనుమకొండ కలెక్టర్ గా బదిలీ అయ్యారు. ఇదిలాఉంటే హనుమకొండ కలెక్టర్ గా పని చేసిన పి.ప్రావీణ్య సంగారెడ్డి కలెక్టర్ గా ట్రాన్స్ ఫర్ అయ్యారు. 2016 బ్యాచ్ కు చెందిన ప్రావీణ్య వరుసగా మూడు పోస్టింగులు ఓరుగల్లులోనే తీసుకున్నారు. మొదట 2021 సెప్టెంబర్ 3న జీడబ్ల్యూఎంసీ కమిషనర్ గా ఛార్జ్ తీసుకున్న ఆమె, 2023 మార్చి 13న వరంగల్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత ప్రభుత్వం చేసిన బదిలీ మేరకు 2024 జూన్ 17న హనుమకొండ కలెక్టర్ గా ఛార్జ్ తీసుకున్నారు. గురువారం ఆమెను ప్రభుత్వం సంగారెడ్డికి బదిలీ చేసింది.

జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్​.. 

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్వినీ తానాజీ వాకడే కరీంనగర్ అడిషనల్ కలెక్టర్ గా బదిలీ అయ్యారు. ఆ స్థానంలో కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ గా పని చేస్తున్న 2019 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన చాహత్ బాజ్ పాయ్ ని ప్రభుత్వం జీడబ్ల్యూఎంసీ కమిషనర్ గా బదిలీ చేసింది. చాహత్ బాజ్ పాయ్ ఐఐటీ కాన్పూర్ నుంచి బీటెక్ పూర్తి చేశారు.

2019 ఐఏఎస్ బ్యాచ్ చెందిన ఆమె మొదట ఏపీలోని నంద్యాల్ సబ్ కలెక్టర్ గా పని చేయగా, అనంతరం తెలంగాణ క్యాడర్ కు అలాట్ అయ్యారు. గతంలో ఊట్నూరు ఐటీడీఏ పీవోగా, ఆసిఫాబాద్ అడిషనల్ కలెక్టర్ గా పని చేశారు. ఇప్పుడు కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ గా పని చేస్తుండగా, ప్రభుత్వం జీడబ్ల్యూఎంసీ కమిషనర్ గా బదిలీ చేసింది. జీడబ్ల్యూఎంసీ కమిషనర్ గా ఛార్జ్ తీసుకున్న అశ్వినీ తానాజీ వాకడే కరీంనగర్ అడిషనల్ కలెక్టర్ గా బదిలీ అయ్యారు.