- కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్ టౌన్, వెలుగు: సామాజిక సమానత్వం ద్వారానే అన్నివర్గాలు అభివృద్ధి చెందుతాయని, తద్వారా దేశం పురోగమిస్తుందని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. బుధవారం సిటీలోని భగత్నగర్లోని ప్రభుత్వ బీసీ గర్ల్స్ కాలేజీ హాస్టల్లో నిర్వహించిన ‘తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవం’లో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. సమాజంలోని అన్నివర్గాలకు సమాన అవకాశాలు కల్పించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమన్నారు. దివ్యాంగులు, నిరుపేదలకు సమాన అవకాశాలు, వృద్ధులకు న్యాయం, సేవా అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.
డీఆర్వో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విద్యార్థులు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు. అనంతరం వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అంతకుముందు కరీంనగర్ ప్రాంతీయ క్రీడా స్కూల్ను కలెక్టర్ సందర్శించారు. విద్యార్థుల జిమ్నాస్టిక్స్ సాధనను, స్కూల్ లోని వసతులు, సౌకర్యాలను పరిశీలించారు. కార్యక్రమంలో డీవైఎస్వో శ్రీనివాస్ గౌడ్, జిల్లా బీసీ సంక్షేమ అధికారి అనిల్ ప్రకాశ్, వసతి గృహ సంక్షేమ అధికారి శ్రీదేవి పాల్గొన్నారు.
