
గచ్చిబౌలి, వెలుగు: స్కూటీపై వెళ్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగిని వెనుక నుంచి వేగంగా వచ్చిన వాటర్ ట్యాంకర్ ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందారు. మణికొండ పుప్పాలగూడలోని బీఆర్సీ అపార్ట్మెంట్లో ఇరువురి శాలిని(38).. భర్త వెంకటేశ్వర్లు, ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటోంది. ఐటీ కారిడార్లోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది.
మంగళవారం (జులై 29) ఉదయం ఇద్దరు పిల్లలను స్కూటీపై తీసుకెళ్లి దర్గా ఎక్స్ రోడ్డు వద్ద స్కూల్ బస్సు ఎక్కించింది. తిరిగి ఇంటికి వెళ్తుండగా సుందర్ గార్డెన్ వద్ద వెనుక నుంచి వాటర్ ట్యాంకర్ ఢీకొట్టింది. స్కూటీపై నుంచి శాలిని కింద పడగా తల పైనుంచి ట్యాంకర్ వెళ్లడంతో స్పాట్లో మృతిచెందింది. రాయదుర్గం పోలీసులు డెడ్బాడీని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి సోదరుడు లోకేశ్ ఫిర్యాదుతో ట్యాంకర్ డ్రైవర్పై కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ వెంకన్న తెలిపారు.
యూటర్న్ తీసుకుంటుండగా ..
కూకట్పల్లి: యూటర్న్ తీసుకుంటుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఆటో డ్రైవర్ మృతిచెందాడు. గోకుల్ ప్లాట్స్లో నివసించే దాసరి భీమన్న(62) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు కూకట్పల్లి మెట్రో పిల్లర్ నంబర్ 732 వద్ద యూటర్న్ తీసుకుంటున్నాడు. మియాపూర్ నుంచి వేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం ఆటోని ఢీకొట్టడంతో భీమన్న మృతిచెందాడు.