
- వీడిన లావణ్య మర్డర్ మిస్టరీ
- ప్రియుడి అరెస్ట్
హైదరాబాద్ : సాఫ్ట్ వేర్ ఇంజనీర్ లావణ్య హత్యకేసు మిస్టరీ వీడింది. ఆమె ప్రియుడే ఆమెను అతి కిరాతకంగా హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయడంతోనే అతను ఈ దుర్మార్గానికి పాల్పడినట్లు ఆర్ సీ పురం పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నగరంలోని సురేంద్రనగర్కు చెందిన సునీల్ కుమార్(25), లావణ్యలు గత కొంతకాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. శారీరకంగా ఆమెను వాడుకున్న సునీల్ ఆమెతో పెళ్లికి నిరాకరించాడు.
ఈ నేపథ్యంలో లావణ్య పెళ్లి గురించి పలుమార్లు అతడిపై ఒత్తిడి చేయడంతో ఎలాగైనా ఆమె అడ్డుతొలిగించుకోవాలనుకున్నాడు. ఇందుకోసం పథకం ప్రకారం ఆమెను ఓ హోటల్కు రమ్మని, అక్కడ మాట్లాడుకుందామని నమ్మించాడు. అక్కడికి వెళ్లిన తర్వాత తన స్నేహితుడు సాయంతో.. లావణ్యను అతికిరాతకంగా చంపాడు. ఎవరికి అనుమానం రాకూడదనే ఉద్దేశంతో మృతదేహాన్ని సూట్ కేసులో పెట్టి..సూరారం కాలువలో పడేశాడు. రెండు రోజులుగా లావణ్య కనిపించకపోవటంతో ఆమె తల్లిదండ్రులు ఆర్సీ పురం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు.. అనుమానం వచ్చి ఆమె ప్రియుడు సునీల్ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది.