అలంపూర్ లో జోరుగా ఎర్రమట్టి దందా!

అలంపూర్ లో జోరుగా ఎర్రమట్టి దందా!
  • రూట్  మార్చిన మట్టి మాఫియా 
  • ప్రైవేటు పొలాలు కొనుగోలు చేసి ఇల్లీగల్‌‌గా తవ్వకాలు
  • పొలాల మధ్య క్వారీలతో రైతులకు తిప్పలు

గద్వాల, వెలుగు:  జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని మానవపాడు, ఉండవెల్లి మండలాల్లో ఎర్రమట్టి దందా జోరుగా సాగుతోంది. ఒకవైపు ఎర్రమట్టి తవ్వకాలు మరో వైపు నల్ల మట్టి తవ్వకాలు చేస్తూ  ప్రైవేటు, పట్టా, ప్రభుత్వ భూములను ధ్వంసం చేస్తున్నారు. ప్రభుత్వ భూములు, అసైన్డ్, ప్రభుత్వ గుట్టలను ధ్వంసం చేసిన మాఫియా ఇప్పుడు పంట భూముల్లో ఇల్లీగల్ గా తవ్వకాలు చేస్తూ దందా కొనసాగిస్తున్నారు.

  పంట భూముల్లో తవ్వకాలు చేయాలన్నా ప్రభుత్వ పర్మిషన్ తప్పనిసరిగా ఉండాలి.  కానీ ఎర్ర, నల్ల మట్టి మాఫియా ఎలాంటి పర్మిషన్లు తీసుకోకుండా మైనింగ్, రెవెన్యూ, పోలీస్ ఆఫీసర్లతో కుమ్మక్కై జోరుగా దందాను కొనసాగిస్తున్నారు. మానవపాడు మండలం పెద్ద పోతలపాడు, చిన్న పోతులపాడు గ్రామాలకు చెందిన ఎర్ర మట్టి మాఫియా అక్రమంగా మట్టిని తవ్వి ఓ ప్రైవేట్ వెంచర్ కు అమ్ముకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.  ఉండవల్లి మండలం పుల్లూరులో నల్లమట్టి తవ్వకాలు నిర్వహిస్తూ మాఫియా సొమ్ము చేసుకుంటున్నది.

మట్టి తవ్వకాలకు పర్మిషన్ తప్పనిసరి..

ప్రభుత్వ భూములు, పట్టా భూములు ఏ భూములలోనైన మట్టి తవ్వకాలు చేయాలంటే తప్పనిసరిగా మైనింగ్ డిపార్ట్మెంట్, స్థానిక తహసీల్దార్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి.  ఏ సర్వే నంబర్‌‌‌‌లో తవ్వకాలు చేస్తున్నారు..   ఎంత లోతు తవ్వకాలు చేయాలి, ఎన్ని క్యూబిక్ మీటర్ల మట్టిని తీసుకుంటున్నారు అనే వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది. 

ఎలాంటి పర్మిషన్లు తీసుకోకుండా ఇల్లీగల్ గా పచ్చని పంట పొలాల మధ్య తవ్వకాలు చేస్తూ గుంతల మయంగా చేస్తున్నారని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు.  వర్షం వచ్చినప్పుడు ఆ గుంతల్లో నీరు నిలువ ఉండి ప్రమాదాలు జరిగిన సంఘటనలు చాలా ఉన్నాయని రైతులు వాపోతున్నారు.

ఎకరా 10 లక్షలకు కొనుగోలు

మట్టి తవ్వకాల కోసం మట్టి మాఫియా ప్రైవేటు భూములను సైతం వదలడం లేదు.  రైతుల నుంచి ఎకరా రూ. 7 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు కొనుగోలు చేస్తారు. రిజిస్ట్రేషన్, డాక్యుమెంటేషన్ ఏమి ఉండవు.  అందిన కాడికి మట్టిని తవ్వేస్తున్నారు.  గుంతలు పడ్డ భూమి వ్యవసాయానికి పనికి రాకుండా పోతుంది.  కానీ రైతు పేరు మీద పొలం అలాగే ఉంటుంది.  పక్క పొలాల రైతులు ఆ గుంతలతో  ఇబ్బందులు పడుతున్నారు. 

 డబ్బుకి డబ్బు వచ్చే భూమికి భూమి మిగిలే అని కొందరు రైతులు ఆశపడి భూమాఫియాకు అమ్ముతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.  ఇటీవల మానవపాడు మండల పరిధిలోని  పెద్ద పోతులపాడు గ్రామ శివారులోని సర్వేనెంబర్ 149లో  వ్యవసాయ భూమిలో ఎర్రమట్టి తవ్వకాలు 15 రోజుల నుంచి కొనసాగుతున్న పక్క పొలాల రైతులు కంప్లైంట్ చేసినా పట్టించుకునే నాథుడే లేరని రైతులు వాపోతున్నారు. ఇప్పటికే చాలా ఎకరాల్లో మట్టి మాఫియా లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తరలించి గుంతల మయంగా మార్చిందన్నారు..

ఇల్లీగల్ దందాకు ఆఫీసర్ల సపోర్ట్

అలంపూర్ నియోజకవర్గంలోని మానవపాడు, ఉండవల్లి మండలాల్లో ఇల్లీగల్ దందాకు పోలీస్, పొలిటికల్, రెవెన్యూ, మైనింగ్ సపోర్ట్ ఫుల్ గా ఉందనే చర్చ జరుగుతోంది. మట్టి దందా చేసే మాఫియా టిప్పర్ కు ఒకరేటు, ట్రాక్టర్ కో రేటు మాట్లాడుకొని నెలనెలా మామూళ్లు ఆఫీసర్లకు, లీడర్లకు ఇస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. అలంపూర్ నియోజకవర్గంలో కొందరు లీడర్లు దీన్ని బిజినెస్ గా మార్చుకున్నారు.  

అలంపూర్ నియోజకవర్గంలో దాదాపు 20 నుంచి 30 టిప్పర్లు పదుల సంఖ్యలో ట్రాక్టర్లు ఇల్లీగల్ మట్టి దందాను కొనసాగిస్తున్నారు.  నెలకు లక్షల రూపాయలు చేతులు మారుస్తూ భూములను కొల్లగొడుతున్నారనే విమర్శలు ఉన్నాయి.

ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకుంటాం 

 ప్రైవేట్ భూముల్లో మట్టి తవ్వకాలు చేస్తున్న విషయం మా దృష్టికి రాలేదు.  ఇల్లీగల్ గా ప్రైవేట్ భూముల్లో మట్టి తవ్వకాలు చేయకూడదు. సంబంధిత మండలాల తహసీల్దార్లకు ఈ విషయంపై ఎంక్వయిరీ చేయమని ఆదేశాలు ఇస్తాం. రిపోర్ట్ వచ్చిన వెంటనే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటాం.–అలివేలు, ఆర్డీఓ, గద్వాల.