నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: నాగర్ కర్నూల్ జిల్లాలో సోలార్ మోడల్ గ్రీన్ ఎనర్జీని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
నాగర్ కర్నూల్ మండలం తూడుకుర్తి, బల్మూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామాలను మోడల్ సోలార్ గ్రీన్ ఎనర్జీ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు వంద శాతం లక్ష్య సాధనకు కృషి చేయాలన్నారు.
వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లిలో ఇప్పటికే విజయవంతమైన సోలార్ నమూనాను ఆదర్శంగా తీసుకుని, ఎంపిక చేసిన గ్రామాల్లోని ప్రతీ ఇంటికి, వ్యవసాయ పంపుసెట్లకు సౌర విద్యుత్ అందించేలా రైతులకు, ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
గ్రామీణ ప్రాంతాల్లో పునరుత్పాదక ఇంధన వనరులను ప్రోత్సహించడం ద్వారా రైతులపై విద్యుత్ భారం తగ్గడంతో పాటు పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
