- మహబూబ్నగర్ కలెక్టర్ ఖుష్బూ గుప్తా
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: అక్షరాస్యతతోనే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని, వ్యక్తి సాధికారతకు, కుటుంబ అభివృద్ధికి, సమాజ పురోగతికి చదువే మూలమని మహబూబ్నగర్ కలెక్టర్ ఖుష్బు గుప్తా అన్నారు. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా మహబూబ్నగర్లో మంగళవారం అక్షరాస్యత అవగాహన ర్యాలీ నిర్వహించారు.
జడ్పీ గ్రౌండ్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీలో విద్యార్థులు, మహిళలు, టీచర్లు, ఫిజికల్ డైరెక్టర్స్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విద్యను అందిపుచ్చుకొని తమ హక్కులు, బాధ్యతలు తెలుసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్, జడ్పీసీఈవో వెంకటరెడ్డి, డీఈవో విజయకుమారి, డీఆర్డీవో నర్సింహులు, తదితరులు పాల్గొన్నారు.
హన్వాడ, వెలుగు: రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా ఆదేశించారు. మంగళవారం మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండల కేంద్రంలోని పీహెచ్సీని కలెక్టర్ తనిఖీ చేశారు.ఈ సందర్భంగా రోగులకు అందుతున్న వైద్య సేవలు, మందుల నిల్వలు, వైద్య పరీక్షలు తదితర అంశాలను పరిశీలించారు.
ఆసుపత్రికి ప్రతిరోజూ వస్తున్న ఔట్పేషెంట్ల (ఓపీ) సంఖ్యపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఓపీ రిజిస్టర్ను పరిశీలించారు. గర్భిణులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం మండలకేంద్రంలోని కేజీబీవీని సందర్శించారు. విద్యార్థులకు అందుతున్న విద్యాబోధన, భోజనం, వసతులను పరిశీలించారు.
