న్యూఢిల్లీ: స్మాల్ సేవింగ్స్ స్కీములలో పెట్టుబడి పరిమితిని సీనియర్ సిటిజెన్లు, మిడిల్క్లాస్ప్రజల కోసమే పెంచినట్లు ఫైనాన్స్ సెక్రటరీ టీ వీ సోమనాథన్ చెప్పారు. బ్యాంకుల కంటే ఎక్కువ రిటర్న్స్ ఇవ్వడమే కాకుండా, భద్రత విషయంలోనూ ప్రభుత్వ స్మాల్ సేవింగ్స్ బెటరని పేర్కొన్నారు. తాజా బడ్జెట్లో సీనియర్ సిటిజెన్స్ స్కీము కింద మాగ్జిమమ్ డిపాజిట్ పరిమితిని అంతకు ముందున్న రూ. 15 లక్షల నుంచి రూ. 30 లక్షలకు పెంచారు. మంత్లీ ఇన్కం ఎకౌంట్ స్కీము కింద పరిమితినీ రూ. 4.5 లక్షల నుంచి రూ. 9 లక్షలకు (సింగిల్ ఎకౌంట్), రూ. 9 లక్షల నుంచి రూ. 15 లక్షలకు (జాయింట్ఎకౌంట్) పెంచారు. సీనియర్ సిటిజెన్స్ స్కీము పరిమితులను చాలా కాలం నుంచి పెంచలేదు.
మిడిల్క్లాస్, సీనియర్ సిటిజెన్స్ సంక్షేమం కోసమే ఈ పరిమితులను ఇప్పుడు పెంచామని ఆయన పేర్కొన్నారు. వృద్ధాప్యంలోని వ్యక్తులకు సేఫ్టీతో కూడిన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లు ఉండాలని అభిప్రాయం వ్యకమైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. గతంలో పరిమితులను పెంచిన తర్వాత వారి ఆదాయం చాలా పెరగడంతో సీలింగ్ను రివ్యూ చేశామని వివరించారు. ఆకర్షణీయమైన వడ్డీతోపాటు, పూర్తి భద్రత ఇచ్చే ఈ స్మాల్ సేవింగ్స్ స్కీములలో ఇప్పుడు సీనియర్ సిటిజెన్లు ఇన్వెస్ట్ చేసుకోవచ్చని సూచించారు. బ్యాంకులు ఇచ్చే వడ్డీ కంటే ప్రభుత్వ స్మాల్ సేవింగ్స్ స్కీములు ఎక్కువ వడ్డీనే ఇస్తున్నాయని సోమనాథన్ పేర్కొన్నారు.
పోస్టాఫీసు మంత్లీ ఇన్కం స్కీముల సీలింగ్ను 1987 తర్వాత రివైజ్ చేయలేదు. ఇక సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీము (ఎస్సీఎస్ఎస్) లిమిట్ను చివరగా 2004 లో రివైజ్ చేశారు. సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీము కింద ఇచ్చే 8 శాతం వడ్డీ కంటే తక్కువ వడ్డీకే మార్కెట్లో ప్రభుత్వం ఫండ్స్ సేకరించే ఛాన్స్ ఉందని, కానీ ప్రభుత్వం వారికి బెనిఫిట్ చేయాలనే ఉద్దేశంతో కొంత భారాన్ని భరిస్తోందని అన్నారు. సీనియర్ సిటిజెన్స్కు ఫిక్స్డ్ ఇన్కం ఇన్స్ట్రమెంట్స్ నుంచి వచ్చేదే ప్రధానమైన ఆదాయం కావడంతో, వారి వెల్ఫేర్కోసం తాజా నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.
మంత్లీ ఇన్కం స్కీము..
మిడిల్క్లాస్, సీనియర్ సిటిజెన్స్ ఎక్కువగా ఇష్టపడే మరో ఇన్స్ట్రమెంట్ మంత్లీ ఇన్కం స్కీము (ఎంఐఎస్). ఈ స్కీము కిందా సీలింగ్పెంచాలని నిర్ణయించారు. ఎంఐఎస్ అనేది 5 ఏళ్ల కాలపరిమితి ఉండే డిపాజిట్ స్కీము. ప్రస్తుతం ఈ స్కీము కింద 7.1 శాతం వడ్డీ చెల్లిస్తున్నారు. వడ్డీ పెంపు ఫలితంగా ప్రభుత్వంపై భారంపడినా, ఇప్పుడున్న పరిస్థితులలో సీనియర్ సిటిజెన్స్కు మేలు చేయాలంటే ఈ పెంపుదల ఆవశ్యకమని ప్రభుత్వం అభిప్రాయపడినట్లు సోమనాథన్ వివరించారు. స్మాల్సేవింగ్స్ స్కీములపై వడ్డీని ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రభుత్వం రివ్యూ చేస్తుంది. 60 ఏళ్ల వయసు దాటిన వ్యక్తులు సీనియర్ సిటిజెన్స్ సేవింగ్స్ స్కీము కింద ఎకౌంట్లను ఓపెన్ చేసుకోవచ్చు. ఇందులో 5 ఏళ్ల కాలానికి డబ్బును డిపాజిట్ చేసుకునే వీలుంటుంది.