- వార్షికంగా 41 శాతం తగ్గుదల
న్యూఢిల్లీ: ఐటీ కంపెనీ టెక్ మహీంద్రాకు ఈ ఏడాది మార్చితో ముగిసిన నాలుగో క్వార్టర్లో రూ.661 కోట్ల నికర లాభం వచ్చింది. ఏడాది లెక్కన ఇది 41శాతం క్షీణించింది. గత మార్చి క్వార్టర్లో రూ.1,117.70 కోట్ల లాభం వచ్చింది. 2023 నాలుగో క్వార్టర్లో కంపెనీ ఉద్యోగుల సంఖ్య 1,46,250 నుంచి 1,45,455లకు పడిపోయింది. 2024 నాలుగో క్వార్టర్లో ఇది సీక్వెన్షియల్గా ఒక శాతం పడిపోయింది.
నెట్ న్యూ డీల్విన్స్(టీసీవీలు) విలువ 2024 నాలుగో క్వార్టర్లో 500 మిలియన్ల డాలర్లు ఉంది. ఇది మూడో క్వార్టర్లో 381 మిలియన్ డాలర్లు ఉంది. అయితే 2023 నాలుగో క్వార్టర్లో ఉన్న 592 మిలియన్ల డాలర్లతో పోలిస్తే భారీగా తగ్గిందని కంపెనీ తెలిపింది. 2025 ఆర్థిక సంవత్సరంలో క్లయింట్ చేసే ఖర్చులు పెరగాలని కోరుకుంటున్నామని టెక్మహీంద్రా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ మోహిత్ జోషి తెలిపారు. 2024 ఆర్థిక సంవత్సరంలో ఐటీ సేవల రంగం నుంచి కంపెనీకి తగినంత రాబడి వచ్చిందని పేర్కొన్నారు.
క్యూ4 ఫలితాల ముఖ్య అంశాలు:
1. సీక్వెన్షియల్గా నికర లాభం 29.5 శాతం పెరిగింది. 2024 నాలుగో క్వార్టర్లో కన్సాలిడేటెడ్గా ఆదాయం 6.2 శాతం తగ్గి రూ.12,871 కోట్లకు చేరుకుంది. సీక్వెన్షియల్ ప్రాతిపదికన ఆదాయం 1.8 శాతం తగ్గింది.
2. ఇబిటా మార్జిన్ లేదా ఆపరేటింగ్ మార్జిన్ 7.4 శాతంగా ఉంది- ఇది మునుపటి క్వార్టర్లో 5.4 శాతం నుంచి పెరిగింది.
3. 2024 ఆర్థిక సంవత్సరం ఆదాయం రూ.51,996 కోట్లకు చేరింది. ఇది వార్షికంగా 2.4 శాతం తగ్గింది. నికర లాభం సంవత్సరానికి 51.2 శాతం తగ్గి రూ.2,358 కోట్లుగా ఉంది.
4. టెక్ మహీంద్రా బోర్డు రూ.ఐదు ముఖ విలువ కలిగిన ఈక్విటీ షేరుకు రూ.28 తుది డివిడెండ్ను (560శాతం) సిఫార్సు చేసింది.