బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య
ఎల్బీనగర్, వెలుగు: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల 50 వేల జాబ్లకు నోటిఫికేషన్లు వెంటనే ఇయ్యాలని జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కొందరు ఐఏఎస్ అధికారులు రియల్ ఎస్టేట్ బిజినెస్ కాంట్రాక్టర్ల అవతారమెత్తారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్లు రేపు మాపంటూ నిరుద్యోగ యువతను మభ్యపెడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్మన్ ఘాట్ లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పీఆర్సీ లెక్కల ప్రకారం లక్షా తొంభై రెండు వేల జాబ్లు ఖాళీగా ఉన్నాయని తేల్చగా, ప్రభుత్వం 67 వేలు మాత్రమే ఉన్నాయని చెప్పడం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్ర సాధన కోసం పోరాడిన యువత, జాబ్ల కోసం కూడా పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. టీచర్లు లేరంటూ స్కూళ్లను మూసివేస్తే గ్రామాల్లో ప్రజలు తిరగబడాలని ఆయన పిలుపునిచ్చారు. వెంటనే డీఎస్సీ ప్రకటించాలని కోరారు. జాతీయ బీసీ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, నాయకులు వేణుగోపాల్, నందగోపాల్ తదితరులు ఉన్నారు.