సస్పెన్షన్​ ఎత్తి వేయండి: మెడికల్ స్టూడెంట్ల ఆందోళన

సస్పెన్షన్​ ఎత్తి వేయండి: మెడికల్ స్టూడెంట్ల ఆందోళన
  • గాంధీ మెడికల్ కాలేజీ వద్ద సీనియర్​ స్టూడెంట్ల ఆందోళన
  • ఎత్తివేతపై పునరాలోచన లేదు : డీఎంఈ

పద్మారావునగర్, వెలుగు: గాంధీమెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఘటనపై ఏకపక్షంగా విచారణ చేశారని, సస్పెన్షన్ ఎత్తివేయాలని కొందరు మెడికల్ స్టూడెంట్స్ డిమాండ్​ చేశారు. వారు బుధవారం గాంధీ మెడికల్ కాలేజీ ఎదుట ఆందోళన చేపట్టగా.. పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తూ బందోబస్తు కొనసాగించారు. గాంధీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ​జూనియర్ ​స్టూడెంట్లను ర్యాగింగ్ చేసిన ఘటనలో10 మంది సీనియర్​ స్టూడెంట్లపై విధించిన ఏడాది సస్పెన్షన్‌‌‌‌ను ఎత్తి వేయాలని డిమాండ్​ చేస్తూ కొందరు మెడికల్ స్టూడెంట్స్​ఆందోళనకు దిగారు. 

ముందుగా విద్యార్థుల తరఫున అయిదుగురు కాలేజీ ప్రిన్సిపల్ ​చాంబర్‌‌‌‌‌‌‌‌లో డీఎంఈ  డాక్టర్ కె. రమేశ్​రెడ్డి, ఆస్పత్రి సూపరింటెండెంట్​ ప్రొ.రాజారావు,  వైస్​ ప్రిన్సిపల్ ​డాక్టర్​కృష్ణమోహన్, యాంటీ ర్యాగింగ్ కమిటీ సభ్యులతో చర్చించారు. 10 మంది స్టూడెంట్స్​ ర్యాగింగ్‌‌‌‌కు పాల్పడలేదని, పునరాలోచించాలని కోరగా.. డీఎంఈ రమేశ్​రెడ్డి ర్యాగింగ్ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  

ALSO READ: మేడ్చల్ టికెట్ మల్లారెడ్డికిస్తే ఓడిపోవడం ఖాయం: నక్క ప్రభాకర్ గౌడ్ 

యూజీసీ సెల్‌‌‌‌కు కంప్లైంట్ చేయడంతోనే..

సీనియర్లు తమను ర్యాగింగ్ చేస్తున్నారని ఎంబీబీఎస్​ ఫస్ట్ ఇయర్​ స్టూడెంట్స్​ఆవేదనతో ఢిల్లీలోని యూజీసీ యాంటీ ర్యాగింగ్ సెల్‌‌‌‌కు​ ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. ఈ– మెయిల్​ ద్వారా ర్యాగింగ్​పై కంప్లయింట్ చేశారని, వెంటనే కాలేజీలో యాంటీ ర్యాగింగ్ కమిటీ విచారణ చేసిందని తెలిపారు. 

ఎంక్వైరీలో జూనియర్లపై సీనియర్లు ర్యాగింగ్‌‌‌‌కు పాల్పడినట్లు రుజువైందని ఆయన స్పష్టంచేశారు. దీంతో 10 మందిని ఏడాది పాటు కాలేజీ నుంచి సస్పెండ్​ చేశామని వివరించారు. సస్పెన్షన్​పై పునరాలోచన లేదని, ఆందోళన కొనసాగిస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.  సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్ఎంసీ ర్యాగింగ్​నిరోధానికి కఠిన నిబంధనలు రూపొందించిందని.. ఈ మేరకే  చర్యలు తీసుకున్నామని చెప్పారు. 

గ్రామీణ ప్రాంతాల నుంచి పేద విద్యార్థులు ఎంతో కష్టపడి చదివి, మెరిట్ ద్వారా ఎంబీబీఎస్​ సీటు సాధించి డాక్టర్ ​కావాలన్న జీవితాశయంతో వస్తారని,  వారితో స్నేహంగా, ఆదర్శంగా ఉండాల్సిన సీనియర్లు ర్యాగింగ్‌‌‌‌కు పాల్పడటం సిగ్గుచేటని  ఆగ్రహం వ్యక్తంచేశారు. ర్యాగింగ్ భరించలేక బాధితులు ఏదేని అఘాయిత్యానికి పాల్పడితే, వారి కుటుంబసభ్యులకు ఎవరు సమాధానం చెబుతారని డీఎంఈ ప్రశ్నించారు. 

లిక్కర్​, సిగరెట్ తాగాలని ఒత్తిడి

గాంధీ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్‌‌‌‌కు పాల్పడిన సీనియర్ల దారుణాలు ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయి. ఈనెల1న అడ్మిట్​అయిన ఫస్టియర్ స్టూడెంట్లను అర్ధరాత్రి 2 గంటల సమయంలో  తమ రూముల్లోకి సీనియర్లు పిలిపించుకొని, మద్యం, సిగరెట్ ​తాగమని టార్చర్​ పెట్టినట్టు తెలిసింది. 24 గంటల పాటు షూస్​ వేసుకొని, టక్​, టైతో ఉండాలని రూల్​పెట్టి హింసించినట్టు సమాచారం. చదవడానికి  టైమ్​లేక జూనియర్లు సింగిల్​డిజిట్​మార్కులకే పరిమితమయ్యారని కొందరు ప్రొఫెసర్లు తెలిపారు. 

హాస్టల్‌‌‌‌కు వస్తే సీనియర్లు వేధిస్తారని భయపడిన కొందరు జూనియర్లు గాంధీ ఆస్పత్రి ఎదురుగా అన్నదానం వద్ద భోజనం చేస్తున్నారని సమాచారం. జూనియర్లు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని, భయంతో వణికిపోతున్నారని పలువురు ప్రొఫెసర్లు పేర్కొన్నారు. గ్రామాల నుంచి వచ్చిన వీరు ఇంటికి ఏడుస్తూ ఫోన్లు చేస్తున్నారు. 

21 ఏండ్లలోపు ఉన్న స్టూడెంట్లకు లిక్కర్​ఎలా వచ్చిందని పలువురు ప్రశ్నిస్తున్నారు.  గతేడాది కూడా గాంధీలో ర్యాగింగ్ కు పాల్పడిన 15 మందిని 3 నెలల పాటు సస్పెండ్ చేశారు. అయినా పరిస్థితిలో మార్పు రాలేదు. ర్యాగింగ్​కు పాల్పడవద్దని , కఠిన చర్యలు ఉంటాయని ప్రిన్సిపల్, ప్రొఫెసర్లు, పోలీసులు హెచ్చరిస్తున్నప్పటికీ కొందరు సీనియర్లలో మార్పు రావడం లేదు.