- ఉత్తరప్రదేశ్లో ఇద్దరు అబ్బాయిలపై దారుణానికి పాల్పడ్డ స్థానికులు
- దొంగతనం చేశారని నిందిస్తూ చిత్రహింసలు పెట్టినట్లు ఆరోపణలు
లక్నో: దొంగతనం చేశారన్న అనుమానంతో ఇద్దరు అబ్బాయిలపట్ల కొందరు అమానుషంగా ప్రవర్తించారు. బలవంతంగా మూత్రం తాగించారు. పచ్చిమిరపకాయలను మలద్వారంలో రుద్ది చిత్రహింసలు పెట్టారు. ఏవో ఇంజెక్షన్లు ఇచ్చారు. చేతులు వెనక్కి కట్టేసి, తిడుతూ దాడి చేశారు. ఉత్తర ప్రదేశ్లోని సిద్ధార్థ్ నగర్ జిల్లాలో ఈ నెల 4న ఈ దారుణం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఆదివారం బయటపడటంతో వైరల్ అవుతోంది.
ఆరుగురి అరెస్ట్..
బాధిత పిల్లల్లో ఒకరికి పదేండ్లు, ఇంకొకరు 15 ఏండ్ల వయసు ఉంటుంది. వాళ్లిద్దరూ డబ్బులు దొంగిలించారనే అనుమానంతో స్థానికులు కొంతమంది వాళ్లను పట్టుకుని, చేతులను వెనక్కి కట్టేసి కూర్చోబెట్టారు. ఆపై ఓ బాటిల్ లో మూత్రాన్ని తాగించారు.
పచ్చి మిరపకాయలు దంచి వాళ్లను కింద పడుకోబెట్టి ప్రైవేట్ పార్ట్స్పై రుద్దారు. నొప్పితో బాధిత పిల్లలు అరుస్తుండగా వాళ్లకు ఏవో ఇంజెక్షన్లు ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో పోలీసుల దాకా వెళ్లడంతో కేసు దర్యాప్తు చేపట్టారు. దాడికి చేసినవాళ్లలో ఆరుగురిని అరెస్ట్ చేశామని పత్రా బజార్ పోలీసులు చెప్పారు.