భార్య, అత్తమామల హత్యకు ప్లాన్.. ​ అల్లుడు అరెస్టు

భార్య, అత్తమామల హత్యకు ప్లాన్.. ​ అల్లుడు అరెస్టు

నారాయణ్ ఖేడ్, వెలుగు:  భార్యతో పాటు అత్తమామలను చంపేందుకు యత్నించిన  ఒకరిని  నారాయణఖేడ్ పోలీసులు   అరెస్టు చేశారు.  రెండేండ్లుగా తన భార్యను కాపురానికి పంపడం లేదని గొల్ల రమేశ్​  తన భార్యను,   అత్తమామలను  చంపడానికి కుట్ర పన్నాడని నారాయణఖేడ్ సీఐ రామకృష్ణరెడ్డి, ఎస్​ఐ వెంకట్ రెడ్డి  చెప్పారు.   

గొల్ల రమేశ్​ భార్య తన భర్తతో గొడవపడి  రెండేండ్లుగా తల్లిదండ్రులతో కలిసి సంజీవన్ రావుపేటలో   ఉంటోంది. అప్పటి నుంచి భార్యను కాపురానికి పంపడం లేదని రమేశ్​ కోపంతో ఉన్నాడు. దీంతో భార్యతో సహా అత్తమామలను చంపాలని ప్లాన్ వేశాడు. ఈనెల  12న సంజీవన్ రావుపేటలోని మామ రాములు ఇంటి తలుపులకు ఇనుపతీగ అమర్చి కరెంట్​ కనెక్షన్​ ఇచ్చాడు. 

కరెంట్​ లేక పథకం పారలేదు. తర్వాత పొలం దగ్గరికి వెళ్లి రెండు బోర్ మోటర్లను కాలబెట్టాడు. బోరులో రాళ్లు వేసి ధ్వంసం చేశాడు. విచారణలో ఇదంతా చేసింది రమేశ్​ అని తేలడంతో సోమవారం కేసు నమోదు చేసి జైలుకు పంపించారు.