సెప్టెంబర్17న తెలంగాణకు సోనియా

సెప్టెంబర్17న తెలంగాణకు సోనియా

హైదరాబాద్, వెలుగు:  సెప్టెంబర్ 17న హైదరాబాద్‌ పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆ సభకు సోనియాగాంధీని ఆహ్వానించామని చెప్పారు. అదేరోజు పార్టీ మేనిఫెస్టోను సోనియా విడుదల చేస్తారని వెల్లడించారు. శనివారం మీడియాతో రేవంత్ చిట్ చాట్ చేశారు. మేనిఫెస్టో రిలీజ్ చేసే దాకా డిక్లరేషన్లు ప్రకటిస్తామని ఆయన తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడుతూనే ఉంటామన్నారు. ‘‘గద్దర్ తెలంగాణ లెజెండ్. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ట్యాంక్‌బండ్‌పై ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తాం. గద్దర్ పేరిట కవులు, కళాకారులకు అవార్డులు ఇస్తాం. గద్దర్ 55 ఏండ్లు తెలంగాణ కోసం కొట్లాడారు. ఆయనకు విలువ ఇవ్వాల్సిన అవసరం ఉంది” అని చెప్పారు. ఎన్నికలప్పుడే పొత్తులపై చర్చ ఉంటుందని స్పష్టం చేశారు. 

షర్మిల చేరికపై పార్టీలో ఎలాంటి చర్చ లేదన్నారు. ‘‘ఈ నెల 18న ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటిస్తాం. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఖర్గేతో భారీ బహిరంగ సభ నిర్వహించి డిక్లరేషన్ వెల్లడిస్తాం” అని తెలిపారు. ‘‘సీట్ల ప్రకటన మొత్తం హైకమాండ్ చేతిలోనే ఉంది. సోమవారం నిర్వహించే ఎన్నికల కమిటీ సమావేశంలో అభిప్రాయ సేకరణ జరుగుతుంది. ఎన్నికల అబ్జర్వర్లు, సెలెక్షన్ కమిటీలు అభ్యర్థులను ఎంపిక చేస్తాయి” అని పేర్కొన్నారు. సెంటిమెంట్ పేరుతో కేసీఆర్ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని, ఆయనను ఉరి తీయాలని అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో పిండం పెడతామన్నారు.