
సినీ నటుడు సోనూసూద్ రాజకీయాల్లోకి ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు. తనకు ఇప్పట్లో రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ప్రాణం ఉన్నంత వరకు సేవ చేస్తూనే ఉంటానన్నారు. ప్రతి రాష్ట్రంలోనూ వృద్ధాశ్రమం, ఉచిత పాఠశాల ఏర్పాటు చేయడమే తన లక్ష్యమని సోనూసూద్ స్పష్టం చేశారు. హైదరాబాద్ సోమాజిగూడలోని ది పార్క్ హోటల్లో ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఫిక్కీ ఛైర్పర్సన్ శుభ్రా మహేశ్వరి అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఇప్పటివరకు తాను దాదాపు ఏడున్నర లక్షల మందికి సాయం చేశానని, వారిలో 95 శాతం తాను చూడలేదని చెప్పారు. ఇబ్బందుల్లో ఉన్న వారి సమస్యలు తెలుసుకుని ఎవరు సాయం చేయగలరనే నెట్వర్క్ను ఏర్పాటు చేసుకొని ముందుకువెళ్లడం ద్వారా ఈ సేవలు చేయగలిగామని వివరించారు. తన భార్య తెలుగు మహిళ అని, తన సేవలకు ఆమె కుటుంబం నుంచి పూర్తి సహకారం లభిస్తోందని సోనూసూద్ వెల్లడించారు