సౌత్ సత్తా: రాజకీయాల్లో ఇద్దరూ ఇద్దరే

సౌత్ సత్తా: రాజకీయాల్లో ఇద్దరూ ఇద్దరే

రాంపూర్,ఉత్తరప్రదేశ్ లోనే కాదే దేశమంతాఈ పేరు పాపులర్. ఎటు చూసినా నవాబుల కల్చర్ కనిపించే రాంపూర్ లో ఇప్పుడు తెలుగునటి జయప్రద సందడి చేస్తున్నారు. రాంపూర్ వీథుల్లో నడుస్తున్నారు. అందరినీ హిందీలో తడబడకుండా ప్రసంగిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు.ఎన్నికల్లో కమలానికి ఓటేయమని అడుగుతున్నారు. బీజేపీతోనే దేశాభివృద్ది సాధ్యమంటూ లెక్చర్లు కూడా ఇస్తున్నారు. ఎక్కడో గోదావరి ఒడ్డున ఉండే రాజమండ్రి నగరం నుంచి యూపీలోని రాంపూర్ వరకు జయప్రద చేసిన జర్నీలో ఎన్నో ఆసక్తికర మలుపులున్నాయి.

రాంపూర్ కు జయ పాత కాపే….

జయప్రద రాంపూర్ కు కొత్త కాదు. రాంపూర్ నియోజకవర్గంలో అణువణువూ అమెకు కొట్టినపిండే.వరుసగా పదేళ్లు లోక్ సభలో రాంపూర్ కు ఆమె ప్రాతినిథ్యం వహించారు. రాంపూర్ వాయిస్ వినిపించారు. నియోజకవర్గ సమస్యలను పార్లమెం టు వేదికగా దేశం మొత్తానికి తెలియచేశారు. మూడోసారి రాంపూర్ నుంచి పోటీ చేస్తున్నారు.

సిన్మాల్లో ఉన్నప్పటి నుంచే రాజకీయాలపై ఆసక్తి….

సిన్మాల్లో బిజీగా ఉన్నప్పటి నుంచే జయప్రద రాజకీయాలపై ఆసక్తి పెంచు కున్నారు. 1994లోతెలుగుదేశం పార్టీలో చేరారు. రెండేళ్లకే ఆమెను రాజ్యసభకు నామినేట్ చేసింది టీడీపీ. అయితే ఆమె తెలుగుదేశం పార్టీలో ఎక్కువ రోజులు ఉండలేకపోయారు. బాలీవుడ్ లో ఉన్నప్పుడే ఆమెకు రాజకీయవేత్త అమర్ సింగ్ తో పరిచయం ఏర్పడిం ది. జయప్రదకు అమర్ రాజకీయ గురువు అయ్యారు. టీడీపీ కి దూరమైన జయప్రదను అమర్ సింగ్ , సమాజ్ వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ కు పరిచయం చేశారు.

దీంతో 2004 లో ఆమె సమాజ్ వాది పార్టీలో చేరారు. అదే ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో రాంపూర్ సెగ్మెంట్ నుంచి ఆమెకు పార్టీ టికెట్ ఇచ్చింది. ఈ ఎన్నికల్లో రాంపూర్ ప్రముఖురాలు బేగం నూర్ బానో పై రాజమండ్రి నుంచి వచ్చిన జయప్రద విజయం సాధిం చారు. ఈ కారణంతోనే ఆజం ఖాన్ వంటి సీనియర్ల నుంచి వ్యతిరేకత వచ్చినా 2009 లో ఆమెకు మరోసారి రాంపూర్ టికెట్ ఇచ్చింది సమాజ్ వాది పార్టీ. రెండోసారి కూడా జయప్రద గెలిచి లోక్ సభ లోకి అడుగుపెట్టారు. తర్వాత పార్టీలో పొలిటికల్ ఈక్వేషన్స్ మారాయి.

ములా యం సింగ్ కు అమర్ సింగ్ దూరమయ్యారు. ఈ ప్రభావం జయప్రద పొలిటికల్ కెరీర్ పై పడింది. దీంతో గురువు అమర్ సింగ్ తో కలిసి జయప్రద ఎస్పీ నుంచి బయటకు వచ్చారు. అజిత్ సింగ్ నాయకత్వంలోని రాష్ట్రీయ లోక్ దళ్ ( ఆర్ ఎల్డీ) లో చేరారు. 2014 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి బీజేపీ లీడర్ కున్వర్ భారతేంద్ర చేతిలో ఓడిపోయారు. ఈ సమయంలోనే అమర్ సింగ్ అనారోగ్యం పాలయ్యారు. దీంతో జయప్రద చాలా కాలం వరకు ప్రత్యక్షరాజకీయాలకు దూరంగా ఉన్నారు.

 రాజమండ్రి టు రాంపూర్….

జయప్రద అసలు పేరు లలితా రాణి. స్కూల్లో చదువుకునే రోజుల్లో నే డ్యాన్స్ నేర్చుకున్నారు. 1976 లో రిలీజైన ‘ భూమి కోసం  సిన్మాతో సినీరంగ ప్రవేశం చేశారు.

రాం పూర్ లో ఎవరెవరు ….?

ఉత్తరప్రదేశ్ లోని కీలక నియోజకవర్గాల్లో రాంపూర్ ఒకటి. నియోజకవర్గంలో ముస్లిం జనాభా ఎక్కువ. సమాజ్ వాది పార్టీ తరఫున ఆజం ఖాన్ బరిలో ఉన్నారు. రాష్ట్రంలో పదేళ్ల పాటు ఎంపీగా తాను చేసిన మంచి పనులే తనను గెలిపిస్తాయన్న ధీమా వ్యక్తం చేశారు జయప్రద. రాష్ట్రానికి చెందిన సీనియర్ నాయకులు కూడా ఆమెకు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. పాత ప్రత్యర్థులు జయప్రద, ఆజం ఖాన్ పోటీలో ఉండటంతో రాంపూర్ నియోజకవర్గం హీటెక్కింది. మూడో విడతలో భాగంగా ఇక్కడ ఈనెల 23న పోలింగ్ జరగబోతోంది.

 ఆజం ఖాన్ తో పాత గొడవలు….

జయప్రదకు రాంపూర్ ప్రముఖుడు ఆజం ఖాన్ తో పాత గొడవలున్నాయి. 2009 లో జయకు రెండోసారి టికెట్ ఇవ్వడాన్ని ఆజం ఖాన్ తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ఇద్దరి మధ్య ఉన్న గొడవలు బయటపడ్డాయి. అప్పటి గొడవలు ఇప్పటి కీ కొనసాగుతున్నాయి. లేటెస్ట్ గా జయప్రద పై ఆజం ఖాన్ చేసిన కామెంట్స్ పెను దుమారం రేపాయి. ఆజం ఖాన్ కామెంట్స్ ను జాతీయ మహిళా కమిషన్ తప్పుపట్టిం ది. నోటీసులు కూడా ఇచ్చింది. ఆజం ఖాన్ పొలిటికల్ కెరీర్ అంతా వివాదాలే కనిపిస్తాయి.

మథుర… శ్రీ కృష్ణుడు పుట్టినే నేలగా ప్రసిద్ధి అయిన నగరం. ఈ నగరంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఎన్నికల కోలాహాలమే. డ్రీమ్ గర్ల్ గా పాపులరైన బాలీవుడ్ నటి, సిట్టింగ్ ఎంపీ హేమమాలిని ఇప్పుడు రెండోసారి మథుర నుంచి పోటీ చేస్తున్నారు. మాతృభాష తమిళమైనా స్వచ్ఛమైన హిందీలో అందరినీ పలకరిస్తూ మథుర గల్లీల్లో ప్రచారం చేస్తున్నారు. కాలినడకన వెళుతూ అందరిలో జోష్ నింపుతున్నారు. ఎక్కడో చెనైలో భరతనాట్య కళాకారిణిగా పేరు తెచ్చుకున్న హేమమాలిని కొన్ని వేల మైళ్ల దూరాన ఉన్న మథుర ప్రజల మనసులు గెలుచుకోవడం చిన్న విషయం కాదు. ఐదేళ్ల పాటు సెగ్మెంట్ కోసం ఆమె చేసిన మంచి పనులే మరోసారి టికెట్ వచ్చేలా చేశాయి. ఈ ప్రయాణంలో ఎన్నో అవాంతరాలు ఆమె దాటారు.

చెన్నై టు బాలీవుడ్…..

హేమమాలిని 1948లో తమిళనాడులో పుట్టారు.టెన్త్ చదువుతుండగానే భరతనాట్యం నేర్చుకున్నారు.హేమ తల్లి జయాచక్రవర్తికి సినీ రంగంతో పరిచయాలున్నాయి. దీంతో సిన్మాల్లో యాక్ట్ కోరికతో హేమ టెన్త్ తోనే చదువు ఆపేసింది. 1963లో ‘ ఇదు సత్తియం ’ అనే తమిళ సిన్మాలో ఓ పాటకు డ్యాన్స్ చేశారు. ఆమె స్క్రీన్ మీద కనిపించిన తొలి సిన్మా అదే. ఆ తర్వాత పాండవ వనవాసంతో పాటు మరికొన్ని కొన్ని తెలుగు సిన్మాల్లో కొన్ని పాటలకు డ్యాన్స్ చేశారు. అయితే హీరోయిన్ అవకాశాలు రాలేదు. ఆదుర్తి సుబ్బారావు తెలుగులో అందరూ కొత్త తారలతో ‘తేనెమనసులు’ సిన్మాను తీద్దామనుకుని హేమమాలినికి స్క్రీన్ టెస్ట్ చేయించారు. ఈ స్క్రీన్ టెస్ట్ లో ఆమె ఫెయిల్ అయింది. 1968లో హిందీలో ‘ సప్నోం కా సౌదాగర్ ’ సిన్మాలో ఆమె నటించారు. తర్వాత కొన్ని సిన్మాల్లో ఆమె నటించినా బాక్సాఫీసు దగ్గర అవి పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత ఆమె నటించిన ‘జానీ మేరా నామ్ ’ సిన్మా సూపర్ హిట్ అయింది. హేమమాలిని ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. బాలీవుడ్ కే ఏకైక ‘డ్రీమ్ గర్ల్ ’ అయ్యారు. 1972 లో విడుదలైన ‘ సీతా అవుర్ గీతా ’ సిన్మా ఆమె ను టాప్ స్టార్ చేసింది.

2014 లో లోక్ సభ కు ఎన్నిక….

సిన్మాలే జీవితం అనుకోలేదు హేమ. సామాన్య జనాని కి నాలుగు మంచి పనులు చేయాలని డిసైడ్ అయ్యారు. దీంతో 1999లో పాలిటిక్స్​లో కి ప్రవేశించి వినోద్ ఖన్నాకు ప్రచారం చేశారు. 2003లో రాజ్యసభకు నామినేట్ అయ్యారు. 2014లో బీజేపీ టికెట్ పై మధుర నుంచి లోక్ సభలో ప్రవేశించారు.

ఇండస్ట్రియల్ హబ్ గా మథుర….

ఆగ్రాకు దగ్గరగా ఉండే మథురకు ఇండస్ట్రియల్ హబ్ గా పేరుంది. నియోజకవర్గంలో అనేక రిఫైనరీలు ఉన్నాయి. పారిశ్రామికంగా ఈ ప్రాంతం అభివృద్ది చెందింది. రిఫైనరీలు ఉండటంతో కార్మికులు కూడా పెద్ద సంఖ్యలోనే ఉంటారు.

మథుర పై హేమకు ప్రత్యేక ఆసక్తి…

హేమమాలినికి స్వతహగా శ్రీకృష్ణుడి భక్తురాలు. కృష్ణుడు తిరుగాడిన మథుర అంటే బోలెడంత ఇష్టం .అందుకే కిందటిసారి ఎన్నికల్లో ఏరికోరి మథుర సెగ్మెంట్ ను ఎంపి క చేసుకుని అక్కడ్నుంచి పోటీ చేశారు. దీంతో బీజేపీ చివరిక్షణంలో మథుర టికెట్ సిట్టింగ్ ఎంపీ హేమమాలినికే ఇచ్చింది.

మళ్లీ మథుర నుం చే పోటీ….

సిట్టింగ్ ఎంపీగా ఉన్న హేమమాలినికి మరోసారి మథుర నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం లభించిం ది. ఈసారి ఆమె గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ నుంచి మహేశ్ పట్నాయక్, ఎస్పీ–బీఎస్పీ–ఆర్ఎల్డీ కూటమి కేండిడేట్ గా కున్వర్ నరేంద్ర సింగ్ పోటీలో ఉన్నారు. పోటీ గట్టిగానే ఉన్నా విజయం తనదేనంటున్నారు హేమమాలిని. గత ఐదేళ్లలో మథుర నియోజకవర్గాని కి తాను చేసిన అభివృద్ధి పనులే తనను గెలిపిస్తా యంటున్నారు. ఈనెల 18న మథురలో పోలింగ్ జరుగుతుంది.

మథుర అల్లర్లకు నన్ను టార్గెట్ చేశారు

మూడేళ్ల కిందట మథురలో అల్లర్లు జరిగినప్పుడు కొంతమంది తనను కావాలని టార్గెట్ చేశారని హేమామాలిని బాధపడ్డారు. మథురలో అల్లర్లు జరుగుతుంటే ఎంపీ అయి ఉండి ఏమీ పట్టించు కోకుండా,సిన్మాలకే హేమ పరిమితమయ్యారన్న విమర్శలు వచ్చాయి. ఈ విమర్శలకు ఆమె రియాక్ట్ అయ్యారు.“మథురలో శాంతి భద్రతల పరిస్థితి చూసుకోవాల్సి న బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాని ది. ఎంపీగా నేను అభివృద్ధి పైనే ఫోకస్ చేస్తాను. లా అండ్ ఆర్డర్ తో నాకు సంబంధం లేదు ”అని అన్నారు. ప్రత్యర్థు లు తనను ఎంతగా టార్గెట్ చేసినా ప్రజలకు తన మీద నమ్మకం ఉందన్నారు హేమ.