మెదక్ టౌన్, వెలుగు: జిల్లాలో బాలకార్మిక వ్యవస్థను సమూలంగా నిర్మూలించాలని, ఆపరేషన్ స్మైల్12 ను సక్సెస్ చేయాలని ఎస్పీ డీవీ శ్రీనివాస్రావు సూచించారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయా శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ..ప్రమాదకర ప్రాంతాల్లో పని చేస్తున్న పిల్లలను, తప్పిపోయిన పిల్లలను గుర్తించి రక్షించడం, వారికి పునరావాసం కల్పించడం, వారి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే ఈ కార్యక్రమం ఉద్దేశ్యమన్నారు.
జిల్లా వ్యాప్తంగా వివిధ పరిశ్రమలు, వ్యాపార సముదాయాల్లో ప్రత్యేక బృందాలతో తనిఖీలు నిర్వహించి, పిల్లలను పనిలో పెట్టుకునే యజమానులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీనికై ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పట్టుబడిన పిల్లలను వారి తల్లిదండ్రులకు అప్పగించాలని, వారికి అవసరమైన కౌన్సెలింగ్ అందించాలని సూచించారు.
అనాథ పిల్లలను కేర్ హోమ్లకు తరలించే ప్రక్రియపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. జిల్లాలో ఎక్కడైనా బాల కార్మికులు కనిపిస్తే వెంటనే డయల్ 100 కానీ 1098 కు సమాచారం అందించాలన్నారు. సమావేశంలో ఏఎస్పీ మహేందర్, ఆర్డీవో జయచంద్రా రెడ్డి, డీడబ్ల్యువో హేమభార్గవి, చైల్డ్ వెల్ఫేర్ బాధ్యులు ఉప్పలయ్య, లేబర్ డిపార్ట్మెంట్ డీసీపీవో సత్యేంద్ర ప్రసాద్, హెల్త్ డిపార్టుమెంట్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
