
హైదరాబాద్, వెలుగు: వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే కులగణనకు చట్టం తీసుకురావాలని, ఆ తర్వాత బీసీ కులగణన చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వక్తలు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు రూ. 20 వేల కోట్లతో సబ్ప్లాన్ నిధులు ఇస్తామని ప్రకటించిందని, ఆ హామీని నిలబెట్టుకోవాలన్నారు. శనివారం హైదరాబాద్లోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ప్రజా తెలంగాణ ఆధ్వర్యంలో బీసీ కులగణన అంశంపై చర్చ నిర్వహించారు. కార్యక్రమంలో జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య గౌడ్, మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి, దేవళ్ల సమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జస్టిస్ ఈశ్వరయ్య గౌడ్ మాట్లాడుతూ.. బీసీలకు కాంగ్రెస్ నేతలు, మాజీ ప్రధానులు నెహ్రూ, ఇందిరా గాంధీ అన్యాయం చేశారని.. కానీ పార్టీ ప్రస్తుత ముఖ్య నేత రాహుల్ గాంధీ న్యాయం చేస్తారన్న నమ్మకం ఉందన్నారు. రాహుల్ గాంధీని కలిసినప్పుడు కర్నాటక, తెలంగాణలో కులగణన చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని చెప్పానన్నారు. రాష్ట్రంలో కులగణన నిర్వహించి బీసీల రిజర్వేషన్లు 42 శాతానికి పెంచుతామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించడంతో పాటు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. దేశవ్యాప్తంగా కులగణన చేపడితే కులవిద్వేషాలు, ఘర్షణలు చెలరేగుతాయని కేంద్ర ప్రభుత్వం చెబుతోందని, బ్రిటీష్ ప్రభుత్వం 8 సార్లు కులగణన చేపట్టినప్పుడు ఎన్ని కుల ఘర్షణలు జరిగాయో చెప్పాలన్నారు.
సమగ్ర సర్వే అందుకే ఫెయిల్: ఆకునూరి మురళి
చట్టం చేయకపోవడం వల్లే 2014లో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే విఫలం అయిందని రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి అన్నారు. చట్టం చేయడం వల్ల కులగణనకు న్యాయపరమైన చిక్కులు ఉండవని, ఆలస్యం కాకుండా త్వరగా పూర్తవుతుందన్నారు. సమగ్ర సర్వే ఎమోషనల్ గా, గైడ్ లైన్స్ లేకుండా నిర్వహించారని విమర్శించారు. చట్టం చేయడం వల్ల చర్చలు జరుగుతాయని.. దానికో కమిషన్, విధివిధానాలు ఉంటాయన్నారు. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని ప్రొ. సింహాద్రి అన్నారు. క్యాస్ట్ సెన్సస్ జరిగేలా చూడాలని, మండల్ తరహా ఉద్యమాన్ని మళ్లీ చేపట్టి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలన్నారు.
బీసీలు నిరంతరం ఉద్యమాలు చేస్తేనే సర్వైవ్ కాగలుగుతారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణనకు ప్రయత్నాలు చేస్తున్నా, అందులో సీరియస్ నెస్ కనిపించడంలేదని ప్రొ. మురళీమనోహర్ అన్నారు. కులగణనకు సంబంధించి రోడ్మ్యాప్ను ముందే ప్రకటించాలన్నారు. కర్నాటకలో సెన్సస్ చేశారు కానీ ఆ డేటా బయటపెట్టట్లేదని.. సెన్సస్ చేయడం ఒక ఎత్తయితే, డేటాను బయటపెట్టడం మరో ఎత్తన్నారు. డేటా లేకుండానే పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇవ్వడాన్ని ఆయన తప్పుపట్టారు. కార్యక్రమంలో సతీష్ కొట్టే, పృధ్వీరాజ్, సంతోష్, ప్రొ. నరేందర్, తదితరులు పాల్గొన్నారు.