కిచెన్ తెలంగాణ : పాలకూరతో రుచికరంగా వెరైటీలు

కిచెన్ తెలంగాణ : పాలకూరతో రుచికరంగా వెరైటీలు

పాలకూరతో కొత్తగా ఏదైనా ట్రై చేయాలనుకునేవాళ్లకు ఈ వంటలు బాగా నచ్చుతాయి. పాలకూరతో చాట్, చట్నీ, చక్లీ, చీజ్​బాల్స్ వండేయొచ్చు. అంతేకాదు.. పాలకూరను ఎండబెట్టి, పొడికారం కొట్టి, నిల్వ చేయొచ్చు. ఈ స్పెషల్​ చేసుకునేందుకు ఎక్కువ టైం కూడా పట్టదు. ఆకుపచ్చని పాలకూరతో ఆరోగ్యాన్నిచ్చే రెసిపీలు ఇవి.

చీజ్ బాల్స్ 

కావాల్సినవి :

నూనె - రెండు టీస్పూన్లు 

అల్లం, వెల్లుల్లి తరుగు - ఒక్కో టీస్పూన్​

పచ్చిమిర్చి - ఒకటి 

ఉల్లిగడ్డ తరుగు - రెండు టేబుల్ స్పూన్లు

పాలకూర - రెండు కప్పులు

బ్రెడ్ పొడి - అర కప్పు

కార్న్​ ఫ్లోర్ - రెండు టేబుల్ స్పూన్లు

చీజ్ క్యూబ్స్, ఉప్పు - సరిపడా


తయారీ : పాన్​లో నూనె వేడి చేసి, అల్లం, వెల్లుల్లి తరుగు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ తరుగు, పాలకూర ఒకదాని తర్వాత ఒకటి వేసి వేగించాలి. ఆ తర్వాత వాటిని మిక్సీజార్​లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఆ పేస్ట్​ని ఒక గిన్నెలో వేసి, అందులో బ్రెడ్ పొడి, కార్న్​ ఫ్లోర్, ఉప్పు వేసి కలిపి ముద్ద చేయాలి. తర్వాత చిన్నచిన్న ఉండలు చేయాలి. వాటిని అరచేతిలో పెట్టుకుని గారెల్లా వత్తాలి. దానిపై చీజ్​ క్యూబ్ పెట్టి, మళ్లీ ఉండలా చుట్టాలి. మరో పాన్​లో నూనె వేడి చేసి, అందులో తయారుచేసిన ఉండలు వేగించాలి. వీటిని టొమాటొ కెచప్​తో తింటే సూపర్​ టేస్ట్ ఉంటాయి. 

స్మూతీ

కావాల్సినవి :

పాలకూర ఆకులు - పదిహేను

అరటి పండు - ఒకటి

బాదం పప్పులు - ఐదు

పెరుగు - ఐదు టేబుల్ స్పూన్లు

నీళ్లు - అర కప్పు

వేడి నీళ్లు - సరిపడా

తయారీ : పాలకూర కాడలు తుంచేయాలి. ఆకుల్ని ఒక గిన్నెలో వేసి వేడి నీళ్లు పోసి శుభ్రంగా కడగాలి. తర్వాత వాటిని  మిక్సీజార్​లో వేయాలి. కడిగిన పాలకూరతోపాటు అరటి పండు ముక్కలు, పెరుగు, బాదం పప్పులు వేసి నీళ్లు పోయాలి. అన్నీ కలిసేలా మెత్తగా గ్రైండ్ చేయాలి. అంతే! ఎంతో ఆరోగ్యకరమైన గ్రీన్​ స్మూతీ చిటికెలో రెడీ..

చక్రాలు  

కావాల్సినవి : 

పాలకూర - మూడు కట్టలు(చిన్నవి)

బియ్యప్పిండి - రెండు కప్పులు

శనగ పిండి - అరకప్పు

పుట్నాల పొడి - రెండు టీస్పూన్లు

జీలకర్ర - అర టీస్పూన్

ఇంగువ - చిటికెడు

ఉప్పు - సరిపడా

వెన్న - ఒక టీస్పూన్ 

పచ్చిమిర్చి - రెండు

నీళ్లు - పావు కప్పు

తయారీ : ఒక గిన్నెలో బియ్యప్పిండి, శనగ పిండి, పుట్నాల పొడి, జీలకర్ర, ఇంగువ, ఉప్పు, వెన్న వేసి కలపాలి. మిక్సీజార్​లో పాలకూర, పచ్చిమిర్చి వేయాలి. అందులోనే కొన్ని నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ పేస్ట్​ని బియ్యప్పిండి మిశ్రమంలో వేసి బాగా కలపాలి. కొంచెం కొంచెంగా నీళ్లు పోస్తూ పిండిని కలిపి ముద్ద చేయాలి. తర్వాత చక్రాలు పోసే గిద్దెల్లో పిండి ముద్ద పెట్టి, చక్రాల్లా వత్తాలి. వాటిని వేడి నూనెలో వేగించాలి. 

పకోడీ చాట్

కావాల్సినవి :

పాలకూర - ఒక కట్ట

శనగపిండి - ఒక కప్పు 

బియ్యప్పిండి - అర కప్పు

పసుపు, వాము - ఒక్కోటి పావు టీస్పూన్ చొప్పున

కారం, చాట్​మసాలా, ఉప్పు - ఒక్కోటి అర టీస్పూన్ చొప్పున

నీళ్లు, నూనె - సరిపడా

ఆలుగడ్డ ముక్కలు (ఉడికించి) - కొన్ని 

ఉల్లిగడ్డ తరుగు, క్యారెట్ తురుము, కొత్తిమీర - ఒక టేబుల్ స్పూన్

కారం, జీలకర్ర పొడి, ఆమ్​చూర్ పొడి - ఒక్కోటి పావు టీస్పూన్

సేవ్, బూందీ - ఒక్కోటి రెండు టేబుల్ స్పూన్లు

తయారీ : ఒక గిన్నెలో శనగపిండి, బియ్యప్పిండి, పసుపు, వాము, కారం, చాట్​మసాలా, ఉప్పు వేసి కలపాలి. అందులో నీళ్లు పోసి మరోసారి బాగా కలపాలి. పాలకూర ఆకుల్ని శనగపిండి మిశ్రమంలో ముంచి, వేడి నూనెలో వేగించాలి. ఒక ప్లేట్​లో పాలక్​ పకోడీ పెట్టి, అందులో ఆలుగడ్డ ముక్కలు వేయాలి. తర్వాత గ్రీన్​ చట్నీ, పెరుగు వేసి, కారం చల్లాలి. ఆ తర్వాత ఉల్లిగడ్డ తరుగు, కారం, జీలకర్ర పొడి, ఆమ్​చూర్ పొడి, సేవ్, బూందీ, క్యారెట్ తురుము వేసి, చివరిగా కొత్తిమీర చల్లితే పాలక్​ పకోడీ చాట్​ రెడీ. 

చట్నీ 

కావాల్సినవి :

పాలకూర - ఒక కట్ట

నూనె - మూడు టేబుల్ స్పూన్లు

మినపప్పు, శనగ పప్పు - ఒక్కో టీస్పూన్ చొప్పున

జీలకర్ర - అర టీస్పూన్

పచ్చిమిర్చి - మూడు

అల్లం - చిన్న ముక్క

కొబ్బరి తురుము - అర కప్పు

చింతపండు - కొంచెం

ఆవాలు, మినపప్పు - ఒక్కోటి అర టీస్పూన్

ఎండు మిర్చి - ఒకటి

కరివేపాకు - కొంచెం

తయారీ : పాన్​లో నూనె వేడి చేసి మినప్పప్పు, శనగ పప్పు, పచ్చిమిర్చి, అల్లం వేసి వేగించాలి. అందులో పాలకూర తరుగు కూడా వేసి కాసేపు వేగించాలి. వేగించినవి అన్నీ చల్లారాక వాటిని మిక్సీజార్​లో వేయాలి. వాటితోపాటు కొబ్బరి పొడి, చింతపండు, ఉప్పు కూడా వేయాలి. కొన్ని నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి.  తాలింపు కోసం.. పాన్​లో నూనె వేడి చేసి, ఆవాలు, మినపప్పు, ఎండు మిర్చి, కరివేపాకు  వేగించాలి. ఆ తాలింపును చట్నీలో వేసి కలపాలి. ఈ పాలక్​ చట్నీని ఇడ్లీ, దోశల్లో తింటే టేస్ట్ బాగుంటుంది. 

పొడి కారం 

కావాల్సినవి :

పాలకూర (ఆకుల్లో నీరుపోయ్యేంతవరకు ఎండబెట్టాలి) - రెండు కప్పులు 

పెసరపప్పు, మినపప్పు, శనగపప్పు, కందిపప్పు, మిరియాలు, పుట్నాలు - ఒక్కోటి పావు కప్పు చొప్పున 

ఎండు మిర్చి - ఐదు

జీలకర్ర - ఒకటిన్నర టేబుల్ స్పూన్

వెల్లుల్లి రెబ్బలు - ఎనిమిది

నెయ్యి - ఒక టీస్పూన్

ఉప్పు - సరిపడా

ఇంగువ - పావు టీస్పూన్


తయారీ : ఒక పాన్​లో పుట్నాలు, జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లి విడివిడిగా వేగించి పక్కన పెట్టాలి. తర్వాత పాన్​లో నూనె వేసి ఎండు మిర్చి, శనగపప్పు, పెసరపప్పు, మినపప్పు, కందిపప్పు వేగించాలి. అవన్నీ వేగాక, ఎండబెట్టిన పాలకూర కూడా వేసి మరికాసేపు వేగించాలి. అందులో ఇంగువ కలపాలి. అన్నింటినీ ఒక ప్లేట్​లోకి తీసి, ఆరబెట్టాలి. చల్లారాక, వాటిని మిక్సీజార్​లో వేయాలి. ఒకసారి మెత్తగా పొడి చేసి, అందులో ఉప్పు వేసి కలపాలి. ఈ పొడిని ఇడ్లీ, దోశ, రైస్​ వంటివాటిల్లో తినొచ్చు. దీన్ని  గ్లాస్​ జార్​లో వేసి గాలి చొరబడకుండా మూతపెడితే, రెండు నెలలు నిల్వ ఉంటుంది.