తెలంగాణ కిచెన్ : బాల రాముళ్లకు బలమైన ఆహారం

తెలంగాణ కిచెన్ : బాల రాముళ్లకు బలమైన ఆహారం

ఇప్పుడు దేశమంతా రాముడికి సంబంధించిన వార్తలే. ఎక్కడ విన్నా అయోధ్యలో తయారవుతున్న రామ మందిరం గురించిన ముచ్చట్లే.  అయోధ్యలో బాల రాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా చాలా స్పెషల్స్ ఉన్నాయి. వాటిలో ఫుడ్ కూడా ఉంది. ఆ రోజు సాత్విక ఆహారం తినాలని ఎక్కువమంది అనుకుంటున్నారు. అది సరే మరి ఇంట్లో ఉన్న పిల్ల పిడుగులకు ఏం పెడతారు? వాళ్లకి బలమైన ఫుడ్​  పెట్టాలనుకుంటున్నారా! అయితే ఈ స్పెషల్స్ మీ ఇంటి బాల రాముళ్లు, బుజ్జి తల్లుల కోసం.

గుమ్మడి  రోటి

కావాల్సినవి :

గుమ్మడి పండు ముక్కలు - ఒక కప్పు
గోధుమ పిండి - ఒక కప్పు 

తయారీ : గుమ్మడి పండుని చిన్న ముక్కలుగా తరగాలి. వాటిని మిక్సీజార్​లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఆ పేస్ట్​ని ఒక గిన్నెలో వేసి, అందులో గోధుమ పిండి వేసి రెండింటినీ బాగా మిక్స్​ అయ్యేలా కలపాలి. చపాతీ ముద్దలా చేశాక దాన్నుంచి కొంచెం కొంచెం పిండి తీసుకుని చిన్న ఉండలు చేయాలి. పొడి పిండి అద్దుతూ వాటిని చపాతీల్లా వత్తాలి. ​ వేడి చేసిన పెనంపైన రోటీ వేయాలి. చేతిలో ఒక గుడ్డ పట్టుకుని రోటీని కదిలిస్తూ గుండ్రంగా తిప్పుతుండాలి. అది పూరీలా పొంగేవరకు రెండు వైపులా కాల్చాలి. మెత్తగా ఉండే ఈ రోటీ రుచి తియ్యగా బాగుంటుంది. వీలైతే మట్టి పెనం​ మీద రోటీలు కాల్చుకోవడం ఆరోగ్యకరం. ఇలాగే... కీర దోస, బీట్​రూట్,  పాలకూరతో కూడా రోటీలు చేసుకోవచ్చు.

బీన్స్ దాల్ వేపుడు

కావాల్సినవి :

బీన్స్ తరుగు -  పావుకిలో
శనగ పప్పు -  అర కప్పు, 
ఎండు మిర్చి -  ఐదు
కరివేపాకు, కొత్తిమీర -  కొంచెం
ఉప్పు - సరిపడా
కొబ్బరి నూనె లేదా పల్లీ నూనె, ఆవాలు, నిమ్మరసం -  ఒక్కో టీ స్పూన్
అల్లం తరుగు -  ఒక టీస్పూన్

తయారీ : శనగపప్పుని రెండు గంటలు నానబెట్టాలి. తర్వాత మిక్సీజార్​లో వేయాలి. దాంతోపాటు కరివేపాకు, ఎండు మిర్చి, ఉప్పు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. పాన్​లో నూనె వేడి చేసి ఆవాలు, కరివేపాకు వేగించాలి. అందులో బీన్స్, అల్లం తరుగు వేగించాలి. ఆ తర్వాత శనగపప్పు మిశ్రమం, ఉప్పు వేసి కలపాలి. కాసేపటి తర్వాత నీళ్లు పోసి కలిపి, మూత పెట్టి ఉడికించాలి. చివరిగా కొత్తిమీర, నిమ్మరసం చల్లాలి. దీన్ని చపాతీతో తినొచ్చు. మరీ డ్రైగా కాకుండా కాస్త లిక్విడ్​గా కావాలంటే, పెరుగుతో తినొచ్చు ఈ హెల్దీ రెసిపీని..

చాకొలెట్ మూస్ 

కావాల్సినవి

గెనుసు(మొరం) గడ్డలు -  రెండు
కొబ్బరి పాలు -  అర కప్పు
కర్జూర (నానబెట్టి) -  ముప్పావు కప్పు
కొకొవా పొడి -  రెండు టేబుల్ స్పూన్లు
ఉప్పు -  చిటికెడు

తయారీ : గెనుసు గడ్డల్ని శుభ్రంగా కడగాలి. వాటిని గిన్నెలో వేసి, నీళ్లు పోసి ఉడికించాలి. తర్వాత వాటి తొక్క తీసేసి, మెత్తగా మెదపాలి. ఆ మిశ్రమాన్ని మిక్సీజార్​లో వేయాలి. దానితోపాటు కొకొవా పొడి, కొబ్బరి పాలు, గింజలు తీసేసి, నానబెట్టిన కర్జూర, ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. దీన్ని ఒక కప్పులో వేసి అరగంటసేపు ఫ్రిజ్​లో పెడితే చాలు తినేందుకు రెడీ అయిపోతుంది.

పైనాపిల్ చీజ్ కేక్

కావాల్సినవి :

గుమ్మడి గింజలు - అర కప్పు
బాదం పప్పులు - అర కప్పు
కర్జూర - అర కప్పు
రాతి ఉప్పు - పావు టీస్పూన్

చీజ్​ కోసం :
 

పైనాపిల్ ముక్కలు - ఒక కప్పు
జీడిపప్పులు (నానబెట్టి) - ఒకటిన్నర కప్పు
బెల్లం పొడి - రెండు టేబుల్ స్పూన్లు
కర్జూర - నాలుగు

 ఉప్పు - అర టీస్పూన్
నిమ్మరసం - రెండు టేబుల్ స్పూన్లు 

తయారీ : పాన్​ వేడి చేసి అందులో గుమ్మడి గింజలు, బాదం పప్పులు వేసి వేగించాలి. అవి చల్లారాక మిక్సీజార్​లో వేయాలి. వాటితోపాటు గింజలు తీసేసిన కర్జూర, ఉప్పు వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టాలి. 

చీజ్ తయారీ : 

మిక్సీజార్​లో పైనాపిల్ ముక్కలు, నానబెట్టిన జీడి పప్పులు, బెల్లం పొడి, కర్జూర, నిమ్మరసం, ఉప్పు వేసి గ్రైండ్ చేయాలి. ఆ పేస్ట్​ని గిన్నెలో వేసి, అందులో సన్నగా తరిగిన పైనాపిల్ ముక్కలు వేసి కలపాలి. 

ఒక గ్లాస్​లో ముందు తయారు చేసుకున్న డ్రైఫ్రూట్స్ మిక్స్ వేయాలి. దానిపై పైనాపిల్ మిశ్రమం వేయాలి. ఆ గ్లాస్​ని మూడు గంటలు ఫ్రిజ్​లో పెట్టి, ఆ తర్వాత తింటే టేస్ట్ బాగుంటుంది.

వెజ్ మిల్లెట్ చీలా

కావాల్సినవి 

జొన్న పిండి : రెండు టేబుల్ స్పూన్లు
గోధుమ పిండి : ఒక టేబుల్ స్పూన్
శనగపిండి : ఒక టేబుల్ స్పూన్
ఉప్పు, నీళ్లు, నెయ్యి :  సరిపడా
పసుపు : చిటికెడు
మిరియాల పొడి :  అర టీస్పూన్
బీన్స్, క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజి తరుగు : ఒక్కోటి రెండు టేబుల్ స్పూన్లు

తయారీ : ఒక గిన్నెలో జొన్న పిండి, గోధుమ పిండి, శనగపిండి, ఉప్పు, పసుపు, మిరియాల పొడి వేసి నీళ్లు పోస్తూ కలపాలి. అందులో బీన్స్, క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజి తరుగు వేసి కలపాలి. పాన్​ వేడి చేసి, నెయ్యి పూయాలి. దానిపై రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని దోశలా పోసి రెండు వైపులా కాల్చాలి. 

చైనీస్ మోచి

కావాల్సినవి :

రేగి పండ్లు (ఎండబెట్టినవి) -  పది
బియ్యప్పిండి -  పావు కప్పు
చక్కెర -  ఒక టేబుల్ స్పూన్
నీళ్లు -  కొన్ని

తయారీ : ఎండు రేగి పండ్లను కడిగి తుడవాలి. తర్వాత వాటిని నిలువుగా కట్ చేసి గింజను తీసేయాలి. ఒక గిన్నెలో  బియ్యప్పిండి, చక్కెర వేసి, నీళ్లు పోసి మెత్తటి ముద్దగా కలపాలి. ఆ మిశ్రమం నుంచి చిన్న ఉండలు చేయాలి. ఆ ఉండల్ని రేగి పండ్ల మధ్యలో స్టఫింగ్​ చేయాలి. స్టఫింగ్​ చేసిన వాటన్నింటినీ ఒక ప్లేట్​లో పెట్టాలి. ఆ తర్వాత పాన్​లో ఆ ప్లేట్​ని పెట్టి మూతపెట్టాలి. పది నిమిషాలు ఆవిరికి ఉడికిస్తే చైనీస్​ మోచి రెడీ.