
ఆషాఢమాసం మొదలైంది. ఆడపిల్లల హడావిడి అంతా ఇంతాకాదు.. పల్లెల్లో గ్రామ దేవతలకు మొక్కులు సమర్పించుకుంటున్నారు. చల్లంగా చూడమమ్మ తల్లి అంటూ అమ్మవారిని బోనం సమర్పిస్తూ పూజలు చేస్తున్నారు.
పల్లెల్లో గోరింటాకు చిగురిస్తోంది.. పట్టణాల్లో మార్కెట్లో అమ్ముతున్నారు. ఆషాఢంలో గోరింటాకుకు బాగా గిరాకీ ఉంటుంది. కొత్తగా పెళ్లైన ఆడపిల్లలు ఎప్పుడెప్పుడు ఆషాఢం వస్తుందా.. పుట్టింటికి వెళ్లి.. అమ్మ.. నాన్న.. తమ్ముడు.. చెల్లిలతో సరదాగా గడుపుదామా అనుకుంటారు. అలాంటి ఆషాఢం ఈ నెల 26 వ తేదీ నుంచి మొదలైంది. ఇదంతా ఓ లెక్కయితే... హైదరాబాద్ లో బోనాల శోభ సంతరించుకుంది.
ఆషాఢమాసం వచ్చేసింది.. అడపా దడపా... తొలకరి జల్లులతో.. పచ్చని కోకను సింగారించుకున్న ప్రకృతి ఆషాఢమాసానికి స్వాగతం పలికింది. విశ్వావసునామ సంవత్సరం ( 2025) జూన్ 26 నుంచి నెల రోజుల పాటు ఆషాఢమాసం కొనసాగుతోంది.
తెలంగాణవ్యాప్తంగా బోనాల పండుగను మస్తు సంబురంగ చేసుకుంటున్నారు. శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు, డప్పు చప్పుళ్లు, నృత్యాలతో శ్రావణం దాకా సంబురాలు జరుపుకుంటారు. కొత్త కోడలు ఆషాఢంలో అత్తగారింట్లో ఉండకుండా పుట్టింటికి వెళతారు. ఆడవాళ్లు అరచేతిలో గోరింటాకు పెట్టుకుని చూసుకుని మురిసిపోతారు.
ఆషాఢం జులై నెల 24 తో ముగుస్తది. ఈ మాసంలో కొన్ని ప్రత్యేక పండుగలు జరుపుకుంటారు. హైదరాబాద్లో ఈ రోజు ( జూన్ 29) గోల్కొండ బోనాలు ప్రారంభమైనాయి. . హరిబౌలిలోని అక్కన్న, మాదన్నల ఆలయంలో బోనాలు సమర్పిస్తారు.
గ్రామాల్లోని ఇళ్లన్నీ బంధువుల రాకతో, ఇంటి పరిసరాలన్నీ పచ్చని మామిడి తోరణాలతో కళకళలాడుతాయి. గ్రామ దేవతలకు పూజలు జరుగుతాయి. వర్షాలు బాగా కురవాలని, పంటలు మంచిగా పండాలని అందరు ఆరోగ్యంగా ఉండాలని గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేస్తారు. కొత్తగా పెండ్లైన జంటలను ఆషాఢ మాసంలో ఒకచోట ఉండనియ్యరు. ఆషాఢమాసం పోయి శ్రావణమాసం వచ్చాక బిడ్డకు సారె పెట్టి సాగనంపడం సంప్రదాయంగా కొనసాగుతున్న ఆచారం..