World Environment day 2025: మొక్కలను నాటుదాం... పర్యావరణాన్ని కాపాడుదాం..

World Environment day 2025:  మొక్కలను నాటుదాం... పర్యావరణాన్ని కాపాడుదాం..

ప్రపంచ పర్యావరణ దినోత్సవం అనగానే మన మనసులో ఏదో తెలియని ఆనందం కలుగుతుంది. ఎందుకంటే మనం నిత్యం ప్రకృతితో అటాచ్ అయి ఉంటాం. చిన్నప్పుడు స్కూళ్లలో మొక్కలు నాటుతాం. అలాంటి కార్యక్రమాల్లో పాల్గొని... ఓ మంచి పని చేసిన ఫీల్ పొందుతాం. ఆ ఫీల్ మనలో ఎప్పటికీ ఉంటుంది. ప్రకృతిని ప్రేమించడం కంటే గొప్ప విషయం ఏముంటుంది.. అలా ప్రేమిస్తే... పర్యావరణానికి హాని చెయ్యలేం. సో..  ఈ సందర్భంగా కొన్ని విషయాలు మాట్లాడుకుందాం.

భూమిపై ఉన్న అన్ని ప్రాణులకు జీవనాధారం చెట్లే. చాలా సంవత్సరాల నుంచి చెట్లు గొడ్డలి వేటుకు, రంపపు కోతకు నేల కూలుతున్నాయి. అవసరానికి సరిపడా చెట్లను పెంచలేకపోతున్నాం. దాంతో పర్యావరణంలో అనేక మార్పులొచ్చాయి. ఆ మార్పులు ఇప్పుడు మనిషి మనుగడకే ముప్పు తీసుకొచ్చాయి. అందుకే ఈ రోజు ( జూన్​ 5) మొక్కలను నాటుదాం.. పర్యావరణాన్ని కాపాడుదాం అనే ప్రతిఙ్ఞ చేసి.. దానికి కట్టుబడి ఉందాం. . . 


ఒకప్పుడు దట్టమైన అడవులు ఉండేవి. భూమికి పచ్చని రంగేసినట్టే కనిపించేది. అందుకే స్వచ్ఛమైన గాలి దొరికేది, సమయానికి వర్షాలు కురిసేవి. రాను రానూ జనాభా పెరిగింది. టెక్నాలజీ వాడకమూ, నగరీకరణ పెరిగింది. అవసరాలు పెరిగాయి. ఆ అవసరాలు తీర్చుకునేందుకు మనిషి చెట్లను నరుకుతూ వచ్చాడు. అటవీ సమీప గ్రామాల ప్రజలు అడవులను నరికి వ్యవసాయ భూములుగా మార్చుకున్నారు. 

భూమిపై అడవులు ఉంటేనే వాతావరణం సమతుల్యంగా ఉంటుంది. కానీ, ప్రస్తుతం ఆ శాతం గణనీయంగా తగ్గిపోయింది. కానీ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే  దట్టమైన అడవులు ఉన్నాయి. అందుకే దేశంలో వాతావరణ పరిస్థితులు తారుమారు అవుతున్నాయి. గాలి కలుషితమైంది. భూమి వేడెక్కుతోంది. సకాలంలో వర్షాలు కురవడంలేదు. ఇక ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు పెరిగి, వడదెబ్బ తగిలి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. అంతేకాదు సగటున ప్రతి ఐదు సంవత్సరాలకు ఒక డిగ్రీ చొప్పున ఉష్ణోగ్రత పెరుగుతోంది. 

 వేడి పెరగడం వల్ల భూమిపై ఉన్న అన్ని జీవులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అయితే ఇలాంటి పరిస్థితులను అధిగమించేందుకు ప్రభుత్వాలు 1980లో అడవుల పరిరక్షణ చట్టాన్ని, సమగ్ర అడవుల పరిరక్షణ పథకాన్ని (ఇంటిగ్రేటెడ్ ఫారెస్ట్ ప్రొటెక్షన్ స్కీమ్), 2006లో జాతీయ పర్యావరణ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చాయి. అయినా.. వీటి వల్ల చెప్పుకోదగ్గ మార్పులు ఏమీ రాలేదు. 

మన  అవసరాల కోసం పెద్ద పెద్ద చెట్లను నరికివేయడం, మొక్కలను నాటకపోవడం, ఒకవేళ నాటినా కాపాడకపోవడం వల్ల చెట్ల సంఖ్య బాగా తగ్గింది. ప్రతి ఒక్కరూ బాధ్యతగా చెట్లు నాటాలి. అందరూ ప్రతి వానాకాలంలో పది మొక్కలు నాటి అవి పెరిగే వరకూ సంరక్షించాలి. అడవిలో ఖాళీగా ఉన్న భూమిని గుర్తించి మొక్కలను నాటించాలి. ఇలా ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలి. 

అడవులను కాపాడాలి.. 

విచక్షణా రహితంగా చెట్లను నరికేయడంతో వాతావరణం దెబ్బతిని అనేక అనర్థాలకు దారి తీస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో అడవులను పరిరక్షించడానికి కఠిన చట్టాలు చేసి అమలు చేయాలి. అడవులు తగ్గిపోవడంతో వాతావరణంలో వేడి పెరగడం, గాలిలో ఆక్సిజన్ తగ్గడం, అతివృష్టి, అనావృష్టి లాంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రతిఒక్కరూ కొన్ని మొక్కలను నాటి, వాటిని సంరక్షించడం అనేది ఒక సామాజిక బాధ్యతగా భావించాలి. జీవరాశుల మనుగడ చెట్లపైన ఆధారపడి ఉంది అనే విషయాన్ని  మర్చిపోకూడదు. 

►ALSO READ | Health: పిల్లల్లో జన్యుపరమైన వ్యాధులు.. నిర్ధారణకు కొత్త రక్త పరీక్ష

పంచ భూతాల్ని కాలుష్యమయం చేస్తే... ఆ మసి అంటుకునేది మనకే. నాశనం అయ్యేది మన జీవితాలే. ప్రళయ బాధితులం అయ్యేది మనమే. నిల్చున్న కొమ్మనే నరుక్కుంటున్నాం. ఇకనైనా ప్రకృతిని కాపాడే దిశగా అడుగులు వేయాలి. 

మన చుట్టుపక్కల వాతావరణాన్ని కాపాడుకోవాలని గుర్తుచేస్తోంది ప్రపంచ పర్యావరణ దినోత్సవం. మన భూమిని పచ్చగా, ఆరోగ్యంగా ఉంచుతామని ప్రమాణం చేద్దాం...ఆ దైవం ఈ భూమిని మనకు గిఫ్టుగా ఇచ్చింది. అడవులను కాపాడాల్సిన బాధ్యత మనపై ఉంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మన బాధ్యతల్ని నెరవేర్చుదాం.