
గంగా నది పుష్కరాలకు వెళ్లాలనుకుంటున్న తెలుగు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వేశాఖ శుభవార్త చెప్పింది .పుష్కరాలకు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని స్పెషల్ ట్రైన్స్ నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. తెలుగురాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల నుంచి ఈ రైళ్లు ప్రారంభం కానున్నాయి. సికింద్రాబాద్, ప్రయాగ్రాజ్, వారణాసి మీదుగా రక్సోల్ వరకు ఒక ప్రత్యేక రైలు నడపున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే వెల్లడించింది.
ఏప్రిల్ 22 నుంచి మే 5 వరకు జరిగే గంగా పుష్కరాల కోసం సికింద్రాబాద్, తిరుపతి, గుంటూరు నుంచి వేర్వేరుగా మూడు ప్రత్యేక రైళ్లను నడపనుంది దక్షిణ మధ్య రైల్వే. ఈ మేరకు ఆయా ప్రత్యేక రైళ్ల టైమింగ్స్, గమ్యస్థానాల వివరాలను పేర్కొంటూ.. అధికారిక ప్రకటనను సౌత్ సెంట్రల్ రైల్వే విడుదల చేసింది. ఏప్రిల్ 23, 30, మే 7 తేదీల్లో ఈ రైలు అందుబాటులో ఉంటుందని తెలిపింది. అంతేకాకుండా తిరుపతి, ప్రయాగ్ రాజ్, వారణాసి మీదుగా దానాపూర్ వరకు మరో ప్రత్యేక రైలు, గుంటూరు, ప్రయాగ్ రాజ్ మీదుగా బెనారస్ వరకు ఇంకో రైలు నడపనున్నట్లు పేర్కొంది.
సికింద్రాబాద్ నుంచి రక్సోల్(07007):
గంగా పుష్కరాలు ప్రారంభమైన నేపథ్యంలో సికింద్రాబాద్ నుంచి రక్సోల్ వరకు నడిచే ప్రత్యేక రైలును ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. ఈ రైలు సికింద్రాబాద్ నుంచి ప్రయాగ్ రాజ్-వారణాసి మీదుగా రక్సోల్ చేరుకుంటుంది. ఏప్రిల్ 23, ఏప్రిల్ 30, మే 7 తేదీలలో సికింద్రాబాద్ నుంచి రక్సోల్కి ప్రతి ఆదివారం రాత్రి 10: 30 నిముషాలకు ప్రారంభమవుతుంది.
తిరుపతి నుంచి దానాపూర్(07419):
సికింద్రాబాద్ నుంచి రక్సోల్ వరకు నడిచే ప్రత్యేక రైలు మాదిరిగానే తిరుపతి నుంచి దానాపూర్కి కూడా మరో స్పెషల్ ట్రైన్ ప్రారంభం కానుంది. ఈ ట్రైన్ తిరుపతి నుంచి ప్రయాగ్ రాజ్-వారణాసి మీదుగా దానాపూర్ చేరుతుంది. ఇక ఈ ట్రైన్ ఏప్రిల్ 22 & 29 అలాగే,మే 7వ తేదీలలో తిరుపతి నుంచి ప్రారంభమవుతుంది.
గుంటూరు నుంచి బెనారస్(07230):
గంగా పుష్కరాలకు వెళ్లే వారి కోసం గుంటూరు నుంచి కూడా ప్రత్యేక రైలు ఉంది. ఈ ట్రైన్ గుంటూరు నుంచి ప్రయాగ్ రాజ్ మీదుగా బెనారస్ వరకు వెళ్తుంది. ఏప్రిల్ 22 & 29 అలాగే, 06 మే తేదీలలో ఇది నడుస్తుంది.