సాగర్​ డ్యామ్ గేట్ల నిర్వహణ పనులు ముమ్మరం

సాగర్​ డ్యామ్ గేట్ల నిర్వహణ పనులు ముమ్మరం

హాలియా, వెలుగు: నల్గొండ జిల్లా నాగార్జునసాగర్  డ్యాం క్రస్ట్​ గేట్ల నిర్వహణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. వానాకాలం సీజన్  ప్రారంభం అవుతున్న నేపథ్యంలో సాగర్  డ్యాం క్రస్ట్  గేట్ల నిర్వహణ పనులను ప్రారంభించారు. ఏటా నాగార్జునసాగర్  జలాశయానికి ఎగువ నుంచి వరద నీరు వచ్చే సమయానికి ముందే క్రస్ట్  గేట్ల మెయింటెనెన్స్​ పనులు పూర్తి చేస్తారు. ఇప్పటికే క్రస్ట్  గేట్లకు అవసరం ఉన్నచోట్ల రబ్బర్  సీళ్లను అమర్చారు. 

గ్రీజింగ్, ఆయిలింగ్  వంటి పనులు స్పీడ్​గా పూర్తి చేస్తున్నారు. ఈ సందర్భంగా డ్యాం ఇన్​చార్జి ఎస్ఈ మల్లికార్జునరావు మాట్లాడుతూ సాధారణంగా సాగర్ కు జూలై చివరి వారం, లేదా ఆగస్టు మొదటివారంలో వరద తాకిడి ఉంటుందని, కానీ, ఈసారి ముందస్తు వర్షాలు పడుతున్న దృష్ట్యా వరద కూడా ముందుగానే వచ్చే అవకాశం ఉందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్టు నిర్వహణ పనులను ప్రారంభించామని తెలిపారు. 26 గేట్లలో ఇప్పటికే 13 గేట్ల పనులను సెంట్రల్  డ్రైవ్, ఎండ్  డ్రైవ్  యూనిట్ల గ్రీజింగ్  పూర్తి చేశామని చెప్పారు. వారం రోజుల్లో మొత్తం క్రస్ట్  గేట్ల నిర్వహణకు సంబంధించిన పనులు పూర్తి చేసి ట్రయల్  రన్  నిర్వహిస్తామని తెలిపారు. జూన్ 20 వరకు సాగర్  డ్యామ్  క్రస్ట్  గేట్ల నిర్వహణ పనులు పూర్తి చేస్తామని చెప్పారు.