
మెహిదీపట్నం, వెలుగు: అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి దేశంలో ఎక్కడా లేనివిధంగా 23 వేల మంది కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేశామని గప్పాలు కొట్టారు తప్ప, చేసిందేమీ లేదని రాష్ట్ర సీఐటీయూ నేత విఠల్, సిటీ నేత మల్లేష్ విమర్శించారు. విద్యుత్ ఆర్టిజన్స్ సమస్యలను పరిష్కరించాలని నిరసిస్తూ మెహీదీపట్నం విద్యుత్ ఆఫీసు వద్ద రాష్ట్ర యునైటెడ్ ఎలక్ట్రికల్ ఎంప్లాయీస్ యూనియన్ (హెచ్1829) నిరాహార దీక్షలు చేపట్టగా వారు మద్దతు తెలిపి మాట్లాడారు.
ఆర్టిజన్స్ కు అర్హతల మేరకు జేఎల్ఎం, జూనియర్ అసిస్టెంట్, సబ్ ఇంజనీర్స్, ఓఎస్ లుగా కన్వర్షన్ ఇవ్వాలని, బిల్ కలెక్టర్, మీటర్ లీడర్స్, ఎస్పీఎం, పీఏఏలకు జీవో నంబర్.11 ప్రకారం కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ట్రాన్స్ కో, జెన్క్ కో, డిస్కంలోని సెక్యూరిటీ గార్డులను ఆర్టిజన్స్ గా గుర్తించాలని జీవో నంబర్ 21 గెజిట్ చేసి రూ. 24, 434 చెల్లించాలన్నారు.