స్పౌజ్ బదిలీలు చేపట్టండి.. మినిస్టర్లకు టీచర్ల విజ్ఞప్తి

స్పౌజ్ బదిలీలు చేపట్టండి.. మినిస్టర్లకు టీచర్ల విజ్ఞప్తి

స్పౌజ్ బదిలీలను తక్షణమే చేపట్టాలని స్పౌజ్ టీచర్లు మంత్రులను కోరారు. ఈ మేరకు మినిస్టర్ క్వార్టర్స్ లో  మంత్రులు గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం స్పౌజ్ బదిలీలను చేపట్టకపోవడం వల్ల టీచర్లుగా తీవ్ర మానసిక వేదనకు గురి అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో 317లో భాగంగా మిగతా జిల్లాలకు తమను కేటాయించారని.. దీంతో నిత్యం వందలాది కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తోందన్నారు. ఎక్కువ దూరం ప్రయాణం చేసి వెళ్లాల్సి రావడంతో ఇంట్లో కుటుంబసభ్యులు, పిల్లలను కూడా చూసుకోలేని దయనీయ పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. 

అలాగే.. భార్యాభర్తలు ఇద్దరూ ఒకే జిల్లాలో పనిచేసే విధంగా స్పౌజ్ బదిలీలు తక్షణమే చేయాలని టీచర్లు కోరారు. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం 19 జిల్లాల్లో 615 స్పౌజ్ బదిలీలను చేసింది. ఇక మిగిలిన 13 జిల్లాల్లో స్పౌజ్ బదిలీలను నిలిపివేయడంతో.. అక్కడ కూడా వెంటనే బదిలీలను చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటికి వెళ్లిన టీచర్లు ఆమెను కలిసి తమకు న్యాయం చేయాలని అభ్యర్థించారు.