మారణకాండ.. శ్రీలంకలో ఎమర్జెన్సీ విధింపు

మారణకాండ.. శ్రీలంకలో ఎమర్జెన్సీ విధింపు

వరుస పేలుళ్లతో  అత‌లాకుత‌ల‌మైన శ్రీలంకలో ఇవాళ అర్థ‌రాత్రి నుంచి ఎమర్జెన్సీ అమల్లోకి రానుందని ఆ దేశాధ్య‌క్షుడు మైత్రిపాల సిరిసేన తెలిపారు. భారీ పేలుళ్ల నేపథ్యంలో జాతీయ భద్రతా మండలితో దేశంలో నెలకొన్న పరిస్థితిని సమీక్షించిన శ్రీలంక ప్రధాని విక్రమ సింఘే సోమవారం అర్ధరాత్రి నుంచి ఎమర్జెన్సీ ప్రకటిస్తున్నట్లుగా తెలిపారు. కాగా ఆదివారం ఈస్టర్ సందర్భంగా జరిగిన దాడులకు శ్రీలంక రాజధాని కొలంబో ఇంకా భయం గుప్పిట్లోనే ఉంది.

ఈ మారణ కాండతో అప్రమత్తమైన పోలీస్ శాఖ కొలంబో వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేపట్టింది. తనిఖీల్లో భాగంగా సోమవారం కొలంబో మెయిన్‌ బస్టాండ్‌ వద్ద పోలీసులు 87 బాంబు డిటోనేటర్లను గుర్తించారు. సకాలంలో వీటిని గుర్తించడం వల్ల పెను ప్రమాదం తప్పిందని, లేదంటే మరో దారుణం జరిగి ఉండేదని అధికారులు తెలిపారు. ఈ దాడులకు కారకులుగా భావిస్తున్న 24 మంది అనుమానితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. దాడి వెనుక నేషనల్‌ తౌహీత్‌ జమాద్‌ హస్తముందని భావిస్తున్నారు. ఈ సంస్థకు అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు సహకరించాయని చెబుతున్నారు. వరుస పేలుళ్లలో మృతుల సంఖ్య 300కు చేరువైంది.