2011 వరల్డ్​కప్​ ఫైనల్​ను లంక అమ్ముకుంది

2011 వరల్డ్​కప్​ ఫైనల్​ను లంక అమ్ముకుంది

కొలంబో: టీమిండియా విజేతగా నిలిచిన 2011 వరల్డ్​కప్​ ఫైనల్​ మ్యాచ్​ ఫిక్స్​అయ్యిందని, ఈ మ్యాచ్​ను శ్రీలంక అమ్ముకుందని ఆ దేశ మాజీ స్పోర్ట్స్​ మినిస్టర్​ మహిదానందా అల్తుగమాగే గురువారం సంచలన ఆరోపణలు చేశారు. తాము గెలవాల్సిన మ్యాచ్​ను చేజేతులా జారవిడుచుకున్నామని, దీని వెను క కొన్ని శక్తులు కుట్ర చేశాయని అల్తుగమాగే విమర్శించారు. ‘ఈ రోజు నేను ఓ విషయం చెప్పదల్చుకున్నా. 2011 వరల్డ్​కప్​ ఫైనల్​ను మేం అమ్ముకున్నాం. అప్పుడు స్పోర్ట్స్‌‌ మినిస్టర్‌‌గా నేనే ఉన్నా. దీనిని కచ్చితంగా నమ్ముతున్నా. 2011 ఫైనల్లో మేం కచ్చితంగా గెలిచేవాళ్లం. కానీ ఆ మ్యాచ్​ను అమ్ముకున్నాం కాబట్టి ఓడాం. ఇన్నాళ్లూ దేశ సంక్షేమం దృష్ట్యా ఈ విషయాన్ని బయట పెట్టకూడదని అనుకున్నా. కానీ, ఇప్పుడు నా బాధ్యతగా ఈ విషయాన్ని వెల్లడిస్తున్నా. ఆ మ్యాచ్‌‌ ఫిక్స్‌‌ అయింది. దీనిపై చర్చకు కూడా నేను సిద్ధమే. ఈ మ్యాచ్‌‌పై చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. అయితే, ఫిక్సింగ్‌‌లో ప్లేయర్ల ప్రమేయం లేదు. కొన్ని గ్రూప్‌‌లు కచ్చితంగా ఇన్వాల్వ్‌‌ అయ్యాయి’ అని అల్తుగమాగే వ్యాఖ్యానించారు. 2010 నుంచి 2015 వరకు లంక స్పోర్ట్స్​ మినిస్టర్​గా పని చేసిన అల్తుగమాగే.. ప్రస్తుతం పవర్, రెన్యువబుల్​ఎనర్జీ మినిస్టర్​గా ఉన్నారు. వాంఖడేలో జరిగిన ఆనాటి ఫైనల్లో టీమిండియా 6 వికెట్ల తేడాతో లంకపై గెలిచిన సంగతి తెలిసిందే. ​

అయితే, మహిదానందా ఆరోపణలను 2011 వరల్డ్‌‌కప్‌‌ ఫైనల్‌‌ సెంచరీ హీరో మహేల జయవర్దనే కొట్టి పారేశాడు. త్వరలో జరిగే ఎలక్షన్స్‌‌లో లబ్ది పొందేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించాడు. ఎలక్షన్స్‌‌ ముంగిట ఇలా సర్కస్‌‌ స్టార్ట్‌‌ చేశారని ఎద్దేవా చేశాడు. ఫిక్స్‌‌ చేసిన వారి పేర్లు, అందుకు ఆధారాలు బయట పెట్టాలని డిమాండ్‌‌ చేశాడు. ఆధారాలు చూపించాలని ఆ టోర్నీలో లంక కెప్టెన్ కుమార సంగక్కర కూడా కోరాడు. వాటిని ఐసీసీ, యాంటీ కరప్షన్‌‌ యూనిట్‌‌కు ఇస్తే లోతుగా దర్యాప్తు చేస్తుందని చెప్పాడు.

కాగా, 2011 వరల్డ్‌‌కప్‌‌ ఫైనల్‌‌పై ఫిక్సింగ్‌‌ ఆరోపణలు రావడం ఇదే తొలిసారి కాదు. ఈ మ్యాచ్‌‌పై విచారణ జరిపించాలని లంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ 2017 జులైలోనే డిమాండ్‌‌ చేశాడు. ఈ ఓటమిని చూసి షాక్​కు గురయ్యానని అప్పుడు కామెంటేటర్​గా పని చేసిన రణతుంగ వ్యాఖ్యానించాడు. ‘మ్యాచ్​లో ఏదో జరుగుతుందని ముందే నాకు డౌట్​ వచ్చింది. ఓటమితో అది క్లియర్​ అయ్యింది. లంక టీమ్​లో ఏం జరిగిందో విచారణ జరిపించాలి. అన్ని విషయాలను నేను బయటపెట్టలేను. కానీ ఏదో ఓ రోజు బహిర్గతం చేస్తా. ప్లేయర్లు ఏదో దాస్తున్నారు. విచారిస్తే అన్నీ బయటకు వస్తాయి’ అని రణతుంగ వివరించాడు. ఈ మధ్య శ్రీలంక క్రికెట్​లో ఫిక్సింగ్​ ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తుండటంతో… ప్రతి ఒక్కరూ వరల్డ్​కప్​ ఫైనల్​ గురించి మాట్లాడుతున్నారు. అయితే ఫస్ట్​ ఆరోపణలు వచ్చినప్పుడే ఇండియా ప్లేయర్లు గట్టిగా తిప్పికొట్టారు. అలాంటిదేమీ జరగలేదని ప్రతి ఒక్కరూ చెప్పడంతో కొన్ని రోజులు విమర్శలు ఆగాయి. కానీ. ఇప్పుడు లంక మంత్రి వ్యాఖ్యలతో ఏం జరుగుతుందో చూడాలి.

కెప్టెన్ గా సచిన్ ఫెయిల్ కాలేదు