
- మంత్రి శ్రీధర్ బాబు
చందానగర్, వెలుగు: దేశంలోని ఇతర నగరాలకు రోల్ మోడల్గా హైదరాబాద్ను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో పనిచేస్తున్నట్లు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. హెచ్- సిటీ ప్రాజెక్టులో భాగంగా రూ.45 కోట్లతో ఎన్ హెచ్ 65 నుంచి అమీన్ పూర్ వరకు చేపట్టబోయే రోడ్డు విస్తరణ పనులకు గురువారం చందానగర్ లో ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నామని, ఇప్పటికే బడ్జెట్లో రూ.10వేల కోట్లకు పైగా నిధులు కేటాయించామన్నారు. ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు రూ.7,032 కోట్లతో ఫ్లై ఓవర్లు, అండర్పాస్లు, రోడ్డు విస్తరణ వంటి మౌలిక సదుపాయాల కల్పనకు హెచ్-సిటీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టామన్నారు.
ట్రాఫిక్ రద్దీ క్రమబద్ధీకరణ, ప్రయాణ సమయం తగ్గింపు, రహదారి నెట్వర్క్ను మెరుగుపరచడంతోపాటు పర్యావరణహితంగా నగరాన్ని అభివృద్ధి చేయడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యమన్నారు. ఇప్పటికే సిటీలో ఆర్టీసీ ఆధ్వర్యంలో వేయి ఎలక్ట్రిక్ బస్సులను నడిపించేందుకు ప్రణాళికలు రూపొందించామని, వాటికి అదనంగా మరో 800 బస్సులను తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి సంకల్పించారని పేర్కొన్నారు. ప్రస్తుతం నగరంలోని ట్రాఫిక్ సిగ్నల్స్ ను ఏఐతో అనుసంధానం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు కీలక ప్రాంతాల్లో ఈవీ చార్జింగ్ స్టేషన్లను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు వివరించారు. హైదరాబాద్ అభివృద్ధిని ఒక్క ప్రాంతానికే పరిమితం చేయకుండా నలువైపులకు విస్తరిస్తామన్నారు. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, కార్పొరేటర్లు మంజుల, రాగం నాగేందర్ యాదవ్ పాల్గొన్నారు.