పుణే వేదికగా భారత్, శ్రీలంక జట్ల మధ్య జరుగుతోన్న రెండో టీ20 మ్యాచ్ లో లంక జట్టు భారీ స్కోర్ చేసింది. 6 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన లంక జట్టుకు ఓపెనర్లు కుశాల్ మెండిస్ (52) ,నిశాంక (33) మంచి శుభారంభాన్ని ఇచ్చారు. దూకుడుగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో మెండిస్ హాఫ్ సెంచరీని కంప్లీట్ చేశాడు. ఆ తరువాత చాహల్ వేసిన తొమ్మిదో ఓవర్లో 83పరుగుల వద్ద లంక తొలి వికెట్ ను కోల్పోయింది. మెండీస్ (52) ఎల్బీగా వెనుదిరగగా, ఆ తరువాత వచ్చిన రాజపక్స (2) ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు.
అనంతరం క్రీజ్ లోకి వచ్చిన అసలంక(37) తో మరో ఓపెనర్ నిశాంక మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడాడు. 98 పరుగుల వద్ద అక్షర్ బౌలింగ్ లో నిశాంక ఔటయ్యాడు. ఆ తరువాత లంక బ్యాటర్లు వరుసగా పెవిలియన్ బాట పట్టారు. 16 ఓవర్లో ఉమ్రాన్ వరుసగా రెండు వికెట్లు పడగొట్టాడు. అసలంక (37) పరుగులు చేసి క్యాచ్ ఔట్ కాగా, ఆ తరువాత వచ్చిన హసరంగ డకౌట్గా వెనుదిరిగాడు. ఇక చివర్లో శనక(56) బ్యా్ట్ ఝలిపించాడు. కేవలం 22 బంతుల్లోనే 56 పరుగులు చేశాడు. దీంతో లంక భారీ స్కోర్ చేయగలిగింది. కాగా మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో ఇప్పటికే ఫస్ట్ టీ20 మ్యాచ్ లో టీమిండియా గెలిచి సిరీస్ లో ముందంజలో ఉంది.