శ్రీశైలంలో గర్భాలయ దర్శనాలు నిలిపివేత

శ్రీశైలంలో గర్భాలయ దర్శనాలు నిలిపివేత

శ్రీశైలంలో నేటి నుండి జనవరి 2 వరకు శ్రీస్వామి అమ్మవార్లకు గర్భాలయ స్పర్శ దర్శనాలు(సర్వ దర్శనం కాదు) నిలుపుదల చేస్తున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల అభిషేకాలు, కుంకుమార్చనలు, గర్భాలయ స్పర్శ దర్శనాలు మూడు రోజులపాటు తాత్కాలిక నిలిపివేయనున్నారు. ఈ నెల 31 న శనివారం, జనవరి 1 నూతన సంవత్సరం, 2 వ తేదీన ముక్కోటి ఏకాదశి కూడా రావడంతో శ్రీశైలానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది.

దీంతో ముందస్తు చర్యల్లో భాగంగా శ్రీస్వామివారి గర్భాలయ దర్శనాలు రద్దు చేస్తున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. ఆ ముడురోజులు భక్తులందరికి స్వామి వారి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తమని అధికారులు తెలియజేశారు. అలానే రెండో తేదీన ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీస్వామి అమ్మవార్లకు ఉత్తరద్వారం నుండి భక్తులు దర్శనాలు చేసుకునే విధంగా అవకాశం కల్పిస్తామని అన్నారు. ముక్కోటి ఏకాదశి రోజు శ్రీస్వామి అమ్మవార్లకు రావణవాహనపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారని.. ఆరోజు సాయంత్రం కన్నులపండువగా గ్రామోత్సవం నిర్వహిస్తామని దేవస్థానం అధికారులు తెలిపారు.