- స్టార్ హెల్త్ డైరెక్టర్ హిమాంశు
హైదరాబాద్, వెలుగు: ఇన్సూరెన్స్లో మోసాలను అరికట్టడానికి ఏఐను వాడుతున్నట్టు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ తెలిపింది. మెడికల్ బిల్లులు, ట్రీట్మెంట్ల వివరాల్లో జరిగే అవకతవకలను ఇది గుర్తిస్తుందని కంపెనీ హోల్టైమ్ డైరెక్టర్ హిమాంశు వాలియా చెప్పారు. హైదరాబాద్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి వంద క్లెయిమ్స్లో 10–15 శాతం వరకు మోసపూరితమైనవి ఉంటున్నాయని, 20 శాతం క్లెయిమ్స్ను ఏఐ తనిఖీ చేస్తుందని వివరించారు. ఆసుపత్రుల డాక్యుమెంట్లను విశ్లేషించి తప్పుడు క్లెయిమ్స్ ఉన్నప్పుడు ఈ వ్యవస్థ హెచ్చరిస్తుంది.
డేటా అనలిటిక్స్ సాయంతో గతంలో జరిగిన మోసాల సరళిని బట్టి కొత్త దరఖాస్తులను నిశితంగా పరిశీలిస్తుందని ఆయన వివరించారు. ‘తెలుగు రాష్ట్రాల్లో మాకు 75 బ్రాంచీలు, 1,800 పైగా ఆసుపత్రుల నెట్వర్క్ ఉంది. 2026 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు ఏపీ, తెలంగాణ రూ.1,150 కోట్లు విలువైన 1.7 లక్షలు క్లెయిమ్స్ పరిష్కరించాం. మొత్తం ప్రీమియం విలువ రూ.1,990 కోట్లకు చేరింది.
మా క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 91 శాతం ఉంది. జాతీయ స్థాయిలో రోజుకు 5,800 క్లెయిమ్స్ను పరిష్కరిస్తున్నాం. మా కంపెనీలో క్లెయిమ్స్ తిరస్కరణ ఎక్కువనే ప్రచారంలో నిజం లేదు”అని ఆయన వివరించారు.
