
- ఆర్టికల్ 243డి ప్రకారం రాష్ట్రానికి అధికారం ఉంది: ఆర్.కృష్ణయ్య
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను 42 శాతం బీసీ రిజర్వేషన్లతో రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించవచ్చని బీజేపీ రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. లోకల్ బాడీ ఎన్నికలను సెప్టెంబర్ 30లోగా నిర్వహించాలని హైకోర్టు తీర్పు ఇవ్వడాన్ని స్వాగతించారు. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం లోకల్ బాడీ ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు ఆర్టికల్ 243డి ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉందని చెప్పారు.
గురువారం హైదరాబాద్లోని బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడారు. రిజర్వేషన్లకు 50 శాతం సీలింగ్ అనేది రాజ్యాంగంలో ఎక్కడా లేదని చెప్పారు. ఇదే విషయాన్ని గతంలో సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసిందని గుర్తుచేశారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ద్వారా 60 శాతం వరకు రిజర్వేషన్లు సాధ్యమని కోర్టు తీర్పు ఉందన్నారు. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచి ఎన్నికలు జరిపేందుకు ఎలాంటి చట్టపరమైన అడ్డంకులు లేవని స్పష్టం చేశారు.
కాగా, రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు రూ.8 వేల కోట్ల బకాయిలు ఉన్నాయని, దీంతో కాలేజీల్లో స్టూడెంట్లకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. గురుకులాలు, కాలేజీ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని కోరారు. అంతకు ముందు బీజేపీ ఆఫీసులో ఆయన ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు.