
- విజయవాడకు చెందిన కంపెనీ డైరెక్టర్లు ఇద్దరు అరెస్టు
- ట్రేడింగ్ పేరుతో ఒకరికి రూ.5.4 కోట్ల టోకరా
- రికి సాఫ్ట్వేర్ టెక్ అకౌంట్లో రూ.3.47 కోట్లు డిపాజిట్
హైదరాబాద్, వెలుగు : సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు అందిస్తున్న విజయవాడకు చెందిన ఇద్దరిని రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు అరెస్టు చేశారు. విజయవాడలోని రికి సాఫ్ట్వేర్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు రాంపిల్ల కొండల్ రావు, రాంపిల్ల చంద్రశేఖర్ ఆజాద్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వివరాలను సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ శనివారం వెల్లడించారు. హైదరాబాద్ చిక్కడపల్లి ఆర్టీసీ క్రాస్ రోడ్స్కు చెందిన యువకుడికి జూన్ 8న బీ6 స్టాక్ విజనరీస్ పేరుతో వాట్సాప్లో లింక్ వచ్చింది.
స్టాక్ మార్కెట్లో అధిక మొత్తంలో లాభాలు వస్తున్నట్లు అందులో చూపించారు. ఆ తరువాత లిదియా శర్మ అనే మహిళ పేరుతో ఆ యువకుడితో చాటింగ్ చేశారు. బాధితుడి ఆధార్, పాన్ కార్డులు తీసుకుని నమ్మించారు. గోల్డ్ మెన్ స్విప్. వీఐపీ పేరుతో గోల్డ్మెన్ సచ్స్ పేరుతో ఆన్లైన్లో పెట్టుబడులు ఆఫర్ చేశారు. వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకుని ట్రేడింగ్ చేయాలని సూచించారు. బీఎస్సీ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 ట్రేడింగ్స్లో ఇన్వెస్ట్ చేయాలని చెప్పారు. ఇలా జూలై 10 న రూ.30 వేలు బాధితుడితో తమ అకౌంట్ లో డిపాజిట్ చేయించారు.
రెట్టింపు లాభాలు వచ్చినట్లు ఆన్లైన్లో చూపించారు. ఇలా జులై 25 వరకు రూ.5.40 కోట్లను డిపాజిట్ చేయించారు. ఇందుకుగాను రూ.15.58 కోట్లు లాభాలు వచ్చినట్లు వర్చువల్ అకౌంట్స్ బ్యాలెన్స్ చూపారు. దీంతో డబ్బును విత్డ్రా చేసుకునేందుకు బాధితుడు యత్నించాడు. డబ్బులు విత్డ్రా కాకపోవడంతో మోసపోయినట్లు గుర్తించి జులై 30న సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు ఫిర్యాదు చేశాడు.
బాధితుడు ఫిర్యాదు ఆధారంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు కేసు దర్యాప్తు చేశారు. డబ్బులు ట్రాన్స్ఫర్ అయిన ఖాతాలను గుర్తించారు. విజయవాడ కాస్మోస్ కోఆపరేటివ్ బ్యాంక్లోని రికి సాఫ్ట్వేర్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఉన్న కరెంట్ అకౌంట్లోకి రూ.3.47 కోట్లు ట్రాన్స్ఫర్ అయినట్లు గుర్తించారు. ఇవే అకౌంట్లపై దేశవ్యాప్తంగా 26 కేసులు నమోదు అయినట్లు గుర్తించారు.