ఆమనగల్లు, వెలుగు : బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని, ఆ పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు తాము సిద్ధమని, ఆ పార్టీ నాయకులు ముందుకు రావాలని నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి సవాల్ చేశారు. బుధవారం ఆమనగల్లులో నిర్వహించిన ‘మహనీయుల జ్ఞాన చైతన్య బస్సు యాత్ర’లో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు.
నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ నేతలు, వాటిని తమ కుటుంబానికే పరిమితం చేసుకుని, అబద్ధపు ప్రచారాలతో రాష్ట్రాన్ని 20 ఏండ్లు వెనక్కి నెట్టారని ఆరోపించారు. బీఆర్ఎస్ ఒక మహిళా వ్యతిరేక పార్టీ అని, 2014 నుంచి 2019 వరకు ఐదేండ్ల పాటు సాగిన వారి తొలి ప్రభుత్వంలో ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వని మాట వాస్తవం కాదా అని కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావును ప్రశ్నించారు.
