- కేబినెట్ ఆమోదంతో ఎన్నికల నిర్వహణకు స్టేట్ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు
- కోడ్ వచ్చే అవకాశం ఉండడంతో మున్సిపాలిటీల్లో జోరుగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు.. పట్టణాల్లో ఇందిరమ్మ చీరెల పంపిణీ షురూ
హైదరాబాద్, వెలుగు: మున్సిపల్ ఎన్నికలకు కేబినెట్ గ్రీన్సిగ్నల్ఇవ్వడంతో స్టేట్ఎలక్షన్ కమిషన్ (ఎస్ఈసీ) కసరత్తు ముమ్మరం చేసింది. బుధవారం ఎన్నికలషెడ్యూల్ విడుదల చేసే అవకాశముందని సమాచారం. ఇప్పటికే మేయర్లు, మున్సిపల్ చైర్పర్సన్లతోపాటు వార్డులవారీగా రిజర్వేషన్ల జాబితాలు ఎస్ఈసీ చేతికందాయి. అంతకుముందే ఫొటోలతో కూడిన ఓటర్ల తుది జాబితాను సైతం ఎన్నికల సంఘం ప్రకటించింది.
ఆర్వోలు, ఏఆర్వోలకు శిక్షణ కూడా పూర్తిచేసింది. ఎన్నికల్లో పోటీ చేయబోయే ఇండిపెండెంట్ అభ్యర్థుల కోసం 75 గుర్తులను ప్రకటించింది.ఇక షెడ్యూల్ రిలీజ్ చేసి నామినేషన్ల స్వీకరణ, పోలింగ్కౌంటింగ్ తేదీలను ప్రకటించడమే మిగిలి ఉన్నది. షెడ్యూల్ రిలీజ్ అయితే ఆ వెంటనే రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ వస్తుంది. దీంతో కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు స్పీడప్ చేశారు.
పట్టణాల్లో చీరెల పంపిణీ..
నల్గొండ కార్పొరేషన్లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, భూపాలపల్లి మున్సిపాలిటీలో మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం స్వయంసహాయక సంఘాల మహిళలకు ఇందిరమ్మ చీరెలతో పాటు వడ్డీలేని రుణాల చెక్కులను అందించారు. జీహెచ్ఎంసీతోపాటు అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో పంపిణీ చేసేందుకు సుమారు 35 లక్షల చీరెలకు సర్కారు ఆర్డర్ ఇచ్చింది. కానీ చీరెల తయారీ లేట్ అవడంతో మార్చి 1 నుంచి 8 మధ్య చీరెలు పంపిణీ చేస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది.
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటివరకు తయారైన చీరెలను వీలైనన్ని మున్సిపాలిటీల్లో పంచాలని నిర్ణయించినట్లు తెలుస్తున్నది. ఎలక్షన్ కోడ్ అమల్లోకి వస్తే చీరెల పంపిణీ సాధ్యం కాదని భావించే సోమవారం నుంచి శ్రీకారం చుట్టినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల నుంచి 4 లక్షల చీరెలను అందించేలా ఏర్పాట్లు చేసినట్లు మెప్మా ఆఫీసర్లు చెప్పారు.
