- పగలగొట్టిన కారు విండో గ్లాస్ రిపేర్.. మ్యూజిక్ సిస్టమ్ మిస్సింగ్
మహారాష్ట్రలో ఓ వెరైటీ దొంగతనం జరిగింది. విండో గ్లాస్ పగలకొట్టి మరీ కారు దొంగతనం చేసిన వాళ్లే మరో ఊరిలో దాన్ని వదిలేసి ఓనర్ అడ్రస్ రాసి పెట్టి పరారయ్యారు. ఈ కారును చూసిన వాళ్లు ఓనర్కు అప్పచెప్పండంటూ నోట్ పెట్టారు. అంతేకాదు లాక్ ఓపెన్ చేయడం కోసం పగలకొట్టిన ఆ గ్లాస్ కూడా రిపేర్ చేయించారు. అయితే లక్షల్లో విలువ చేసే కారును తీసుకెళ్లిన దొంగలు దాన్ని వదిలేసి వెళ్తూ సౌండ్ సిస్టమ్, ఇంకొన్ని వస్తువులు మాత్రం ఎత్తుకెళ్లిపోయారు. ఈ వెరైటీ దొంగతనం మహారాష్ట్రలోని పుణేలో జరిగింది. కారును సోమవారం ఓనర్ వద్దకు చేర్చిన పోలీసులు ఈ కేసు వివరాలను మీడియాకు వివరించారు.
పుణేలో విజయ్ రాజ్ టూర్స్ అండ్ ట్రావెల్స్కి చెందిన ఎస్యూవీ కారును గత వారం కొంత మంది దొంగలు తీసుకెళ్లిపోయారు. కోరెగావ్ భీమా ఏరియాలో డ్రైవర్ ఇంటి ఎదుట పార్క్ చేసి ఉన్న కారును బుధవారం తెల్లవారుజామున ఈ దొంగతనం జరిగింది. దీనిపై ట్రావెల్స్ ఓనర్ విజయ్ గవానే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు ఎంక్వైరీ మొదలుపెట్టారు. కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు మరో కారులో నుంచి దిగి విజయ్ రాజ్ ట్రావెల్స్ కారు విండో గ్లాస్ పగలగొట్టి దానిని కూడా తీసుకెళ్లడం క్లియర్గా ఆ ఫుటేజీ కనిపించింది. గురువారం సాయంత్రం పుణే నుంచి దాదాపు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న అహ్మద్నగర్లో ఆ కారును లోకల్స్ చూసి పోలీసులకు చెప్పారు. ఆ కారుపై ‘ఇది విజయ్ రాజ్ ట్రావెల్స్కి చెందినది, దీనిని చూసిన వాళ్లు ఓనర్కి అప్పగించండి’ అని నోట్ రాసి ఉందని పోలీసులు తెలిపారు. కారులో మ్యూజిక్ సిస్టమ్తో పాటు మరికొన్ని వస్తువులు దొంగలు ఎత్తుకెళ్లారని చెప్పారు.
కారు దొరకడంతో ఓనర్ విజయ్ గవానే ఆనందం వ్యక్తం చేశారు. దానిలో రూ.55 వేల వస్తువులు మాత్రమే పోయాయని, ఈ కరోనా టైమ్తో తాను నష్టపోయిన దానితో పోలిస్తే ఇది చాలా తక్కువని, దొంగలు కారు వదిలేసినందుకు సంతోషంగా ఉందని అన్నారు.