- ఎస్పీ నరసింహ
సూర్యాపేట, వెలుగు: పతంగులు ఎగురవేయడానికి చైనీస్ మాంజాను ఉపయోగించవద్దని జిల్లా ఎస్పీ నరసింహ సోమవారం ప్రకటనలో తెలిపారు. చైనీస్ మాంజా విక్రయించడం, వాడటంపై ప్రభుత్వం నిషేధం విధించిందన్నారు. పర్యావరణానికి, పక్షులకు, ముఖ్యంగా వాహనాలు నడిపే వారి ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్న ఈ ప్రమాదకరమైన మాంజాను విక్రయించడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు.
ఈ దారంతో పతంగులు ఎగురవేసే సమయంలో ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉందన్నారు. గతంలో ఇలాంటి ఘటనలు జరిగి ఎందరో ప్రాణాలు కోల్పోయారన్నారు. . జిల్లాలోని ఫ్యాన్సీ షాపులు, పతంగుల విక్రయ కేంద్రాలపై పోలీసులు నిరంతరం నిఘా ఉంచుతారని, ఎక్కడైనా నిషేధిత చైనీస్ మాంజా కనిపిస్తే వెంటనే వాటిని సీజ్ చేయడమే కాకుండా సంబంధిత విక్రేతలపై కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
కేవలం వ్యాపార లాభాల కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని వ్యాపారులకు సూచించారు. పర్యావరణ హితమైన, సురక్షితమైన నూలు (కాటన్) దారాలను మాత్రమే విక్రయించాలన్నారు. ఎవరైనా రహస్యంగా చైనీస్ మాంజా విక్రయిస్తున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే స్థానిక పోలీసులకు లేదా డయల్100 కు సమాచారం అందించాలని ఎస్పీ జిల్లా ప్రజలను కోరారు.
