రాయికల్, వెలుగు: హెచ్ఎం కొట్టాడని మనస్తాపంతో జగిత్యాల జిల్లా రాయికల్ మండలం మైతాపూర్ గ్రామానికి చెందిన దుగ్గిళ్ల అక్షయ్(16) సూసైడ్ చేసుకున్నాడు. ఎస్సై సుధీర్రావు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో టెన్త్ చదువుతున్నాడు. సరిగా చదువుకోకపోతే టెన్త్ ఫెయిల్ అవుతావని హెచ్ఎం చెప్పడంతో గత నెల 26న పురుగుల మందు తాగాడు. అతడిని జగిత్యాల ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున చనిపోయాడు.
మృతుడి తల్లి మల్లీశ్వరీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరపుతున్నామని ఎస్సై తెలిపారు. విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ అక్షయ్ కుటుంబసభ్యులు, బంధువులు రాస్తారోకో చేపట్టారు. హెచ్ఎం మోహన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు, ఎంఈవో రాఘవులు విచారణ జరుపుతామని, మృతుడి కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
