స్కూళ్లు రీఓపెన్ అయ్యేనాటికి అన్ని ఏర్పాట్లు

స్కూళ్లు రీఓపెన్ అయ్యేనాటికి అన్ని ఏర్పాట్లు
  • అన్ని స్కూళ్లలో కోవిడ్ నిబంధనలు..శుచి, శుభ్రత  
  • గిరిజన ప్రాంతాల్లో అవసరమైన చోట్ల సౌర విద్యుత్ సదుపాయం
  • రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్

హైదరాబాద్: సర్కార్ స్కూళ్లలో నాణ్యతా ప్రమాణాలు పెంచేందుకు మౌళిక సదుపాయాలతో ఆధునీకరిస్తున్నందున విద్యార్థుల చేరికలు పెంచేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. అన్ని స్కూళ్లలో కోవిడ్ నిబంధనలు..శుచి, శుభ్రత తప్పనిసరిగా అమలు చేయాలని.. గిరిజన ప్రాంతాల్లోని గూడేలకు విద్యుత్ సదుపాయం కల్పించలేని పరిస్థితి ఉంటే.. అవసరమైన చోట్ల సౌర విద్యుత్ అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. త్వరలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఐటీడీఏ, ప్రాజెక్ట్ అధికారులు, సహాయ ప్రాజెక్ట్ అధికారులు, డిప్యూటీ డైరెక్టర్లు, తదితరులతో తెలంగాణ రాష్ట్ర గిరిజన, స్త్రీ -శిశు సంక్షేమ శాఖల మంత్రి  సత్యవతి రాథోడ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. 
హైదరాబాద్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరిగిన ఈ సమీక్షలో విద్యాశాఖతో సంబంధం ఉన్న ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వచ్చే విద్యా సంవత్సంలో అమలు చేయనున్న కార్యాచరణ ప్రణాళికపై అధికారులకి సూచనలు చేశారు. ఆదివాసి ప్రాంతాల్లో విద్యాలయాల ప్రారంభానికి పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. బడికి వెళ్లే వయసు ఉన్న పిల్లలను గుర్తించి ప్రభుత్వ పాఠశాలల్లోనే చేరే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. 
బడి పాట పేరుతో ర్యాలీలు, తల్లిదండ్రుల్లో అవగాహన
బడి పాట పేరుతో ర్యాలీలు నిర్వహించి తల్లి దండ్రులలో అవగాహన కల్పించాలని మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశించారు. అలాగే స్థానిక ప్రజా ప్రతినిధులను, పాఠశాల విద్యా కమిటీలను ఇందులో భాగస్వాములను చేయాలని సూచించారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామని.. శ్రమ పాఠశాలన్నీ ఆంగ్ల మాధ్యమంలోకి మార్చినందుకుపిల్లలలో ఆంగ్ల మాధ్యమంపై అవగాహన కల్పించాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంక్షేమ విద్యా సంస్థలలో చిన్నా చితక మరమ్మత్తులు ఉంటే  వెంటనే పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. టాయిలెట్స్ అన్నీ నీటితో, బ్లీచింగ్ పౌడర్ తో శుభ్రపరచాలని, నిత్యావసరాలు ముందే అందేలా సమకూర్చు కోవాలన్నారు. 
కోవిడ్ నిబంధనల అనుగుణంగా తరగతి గదులు సిద్ధం చేయాలని మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశించారు. హాస్టల్ విద్యార్ధులకు అవసరమైన వస్తువులు, బుక్స్ తోపాటు విద్యార్ధులకు యూనిఫామ్స్ సరైన సమయంలో కుట్టించి పిల్లలకు అందించాలన్నారు. వచ్చే వర్షాకాలంలో  ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, విద్యార్థుల ఆరోగ్యం విషయంలో అజాగ్రత్త  వహించకూడదని హెచ్చరించారు. సీజనల్ వ్యాధులు ప్రబల కుండా ఏఎన్ఎంల ద్వారా ఆరోగ్య పరిరక్షణ చేపట్టాలని, పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పిచాలని మంత్రి ఆదేశించారు. అలాగే సంక్షేమ హస్టల్స్ విద్యార్ధులు టీచింగ్, నాన్-టీచింగ్ సిబ్బందికి వందశాతం కోవిడ్ టీకాలు పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. 
గ్రామీణ ప్రాంతాల విద్యార్థులపై ప్రత్యేక దృష్టి
గ్రామీణ ప్రాంతాల విద్యార్ధుల పై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశించారు. విద్యార్ధుల చదువుతో పాటు వారి ప్రవర్తన పై ప్రొగ్రెస్ రెడీ చేసి తల్లిదండ్రులకు తెలపాలని అన్నారు. దేశంలోని ప్రతిష్టాత్మక సంస్థల్లో గిరిజన బిడ్డలు సీట్లు సాధిస్తున్నారని మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. సంక్షేమ హాస్టళ్ల అభివృద్ధి ఎంతో అద్భుతంగా జరుగుతోందని, అంతే స్ధాయిలో విద్యార్ధులు చేరికలు పెరిగే విధంగా చూడాలని మంత్రి అధికారుకు సూచించారు. గిరి వికాసం రూరల్ రోడ్డు, ట్రాన్స్పోర్టేషన్  ప్రోగ్రామ్ మరియు ఇతర ట్రైకార్  క్రింద చేపట్టిన అన్నీ స్కీములు వెంటనే పూర్తి అయేట్టు  చూడాలన్నారు.

గిరిజన గూడాల్లో, తండాలలో  జి.సి.సి. ద్వారా సరకులు సరఫరా సక్రమంగా అయ్యేవిధంగా చూడాలని అన్నారు. గిరిజన ఆవాసాలలో 3 ఫేస్ విద్యుదీకరణ పనులు ఇంకా ఎక్కడైనా అవసరమైతే ఆయా ప్రాంతాలలో  విద్యుత్ శాఖ వారి సహకారంతో త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు మంత్రి . ఈ సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తు, స్పెషల్ సెక్రెట్రరి శ్రీధర్, గిరిజన సంక్షేమ శాఖ అదనపు సంచాలకులు సర్వేశ్వర్ రెడ్డి, జాయింట్ డైరెక్టర్ కళ్యాణ్, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారులు, సహాయ ప్రాజెక్ట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.