తొర్రూరు, వెలుగు : డాక్టర్ చదవాలని ఆశపడ్డ ఓ పేద విద్యార్థి ఆర్థిక స్థోమత లేక ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నాడు. తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామానికి చెందిన కడెం గోపాల్, లక్ష్మి దంపతుల కొడుకు రవి ఖాజీపేటలోని మడికొండ సోషల్ వెల్ఫేర్ కాలేజీలో ఇంటర్ చదివి 876 మార్కులు సాధించాడు. హైదరాబాద్లోని గవర్నమెంట్ సోషల్ వెల్ఫేర్ కోచింగ్సెంటర్లో శిక్షణ తీసుకున్నాడు. మొన్న జరిగిన నీట్ పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో4117 ర్యాంకు సాధించాడు. దీంతో అతడికి సంగారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు వచ్చింది.
అయితే హాస్టల్, లైబ్రరీ, ఇతర ఫీజులు కలిపి ఏడాదికి రూ.లక్షన్నర వరకు కట్టాల్సి వస్తోంది. వ్యవసాయ కూలీలుగా పని చేస్తున్న రవి తల్లిదండ్రులు అంత డబ్బును కట్టే పరిస్థితుల్లో లేరు. ఇప్పటికే మరో కొడుకును బీటెక్చదివిస్తున్నారు. తాము రాత్రి పగలు పని చేసినా నెలకు రూ.20 వేలు కూడా సంపాదించలేకపోతున్నామని, ఎవరైనా దాతలు స్పందించి తమ కొడుకు చదువుకు సాయం చేయాలని కోరుతున్నారు. 9391751331 నంబర్కు ఫోన్ పే, పేటీఎం చేస్తే రుణపడి ఉంటామంటున్నారు.