రేగోడ్, వెలుగు : ఫుడ్ పాయిజన్ కారణంగా స్టూడెంట్లు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన మెదక్ జిల్లా రేగోడ్ కేజీబీవీలో గురువారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళ్తే... స్టూడెంట్లకు గురువారం మధ్యాహ్నం ఎగ్ కర్రీ, రాత్రి ఎగ్ పులుసుతో భోజనం పెట్టారు. అది తిన్ని తర్వాత 25 మంది స్టూడెంట్లు వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడ్డారు. గమనించిన కేజీబీవీ సిబ్బంది శుక్రవారం ఉదయం స్టూడెంట్లను స్థానిక ప్రభుత్వ హాస్పిటల్కు తీసుకెళ్లగా.. పరీక్షించిన డాక్టర్లు 15 మందికి టాబ్లెట్లు ఇచ్చి పంపారు.
తీవ్ర అస్వస్థతకు గురైన 10 మందిని మధ్యాహ్నం వరకు హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ చేశాక తిరిగి పంపించారు. గురువారం ఇంటర్నల్ మార్క్స్ వెరిఫై చేసేందుకు కేజీబీవీకి వచ్చిన లింగంపల్లి స్కూల్ టీచర్ రాజు నాయక్, బెజవాడ స్కూల్టీచర్ వెంకటేశం సైతం అక్కడే భోజనం చేయడంతో వారు కూడా అస్వస్థతకు గురై ట్రీట్మెంట్ తీసుకున్నారు.
విషయం తెలుసుకున్న ఎంఈవో గురునాథ్, తహసీల్దార్ దత్తారెడ్డి పరిస్థిని సమీక్షించారు. డీఈవో విజయ కేజీబీవీని సందర్శించి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి శ్రీరాం సైతం కేజీబీవీని సందర్శించారు.
తిర్యాణిలో పిక్నిక్ వెళ్లిన స్టూడెంట్లకు అస్వస్థత
తిర్యాణి, వెలుగు : ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణిలోని ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్కు చెందిన స్టూడెంట్లను శుక్రవారం ఎన్టీఆర్ సాగర్ ప్రాజెక్ట్ వద్దకు పిక్నిక్ తీసుకెళ్లారు. ఈ సమయంలో స్టూడెంట్లకు స్నాక్స్ కింద సమోసాలు ఇచ్చారు. మధ్యాహ్నం చికెన్తో భోజనం పెట్టారు. వాటిని తిన్న కొద్దిసేపటి తర్వాత సుమారు 30 మంది స్టూడెంట్లు వాంతులు చేసుకోవడంతో పాటు సొమ్మసిల్లి పడిపోయారు.
దీంతో స్కూల్ సిబ్బంది వెంటనే స్థానిక సీహెచ్సీకి తరలించగా ప్రాథమిక చికిత్స అందించారు. దుర్వ నవ్యశ్రీ, కుడిమెత రంభ, పుర్క అక్షిత, మర్సుకోల జయ, వెడ్మ రమ్య, కొండపల్లి అనూష పరిస్థితి విషమంగా ఉండడంతో హాస్పిటల్లో అడ్మిట్ చేశారు.
