టీచర్లను నియమించాలని హైవేపై స్టూడెంట్ల ధర్నా.. గంటపాటు రోడ్డుపై బైఠాయింపు

టీచర్లను నియమించాలని హైవేపై స్టూడెంట్ల ధర్నా.. గంటపాటు రోడ్డుపై బైఠాయింపు

గూడూరు, వెలుగు:  మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం పొనుగోడు ప్రభుత్వ పాఠశాలలో టీచర్లను నియమించాలని గురువారం స్టూడెంట్లు ధర్నా  చేశారు.  గ్రామానికి చెందిన చెందిన ఓ వ్యక్తి పాఠశాలను దత్తత తీసుకుని 14మంది ప్రైవేట్​ టీచర్లను నియమించాడు. అయితే రెండు సంవత్సరాలుగా పాఠశాలలో స్టూడెంట్ల నుంచి డొనేషన్ పేరుతో  పైసలు వసూలు చేస్తున్నారని పేరెంట్స్​ మీటింగ్​లో ఎస్ఎంసీ చైర్మన్​ లెక్కలు చెప్పాలని నిలదీశారు.  అతడు మొఖం చాటేయడంతో పాటు ప్రైవేట్​ టీచర్లను 15రోజుల నుంచి పాఠశాలకు రాకుండా దత్తత తీసుకున్న వ్యక్తి బంద్ చేయించాడు. 

అప్పటి నుంచి పాఠాలు బోధించే వారు లేక ఈ విషయాన్ని విద్యాశాఖ ఆఫీసర్లకు, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అయినా పరిష్కారం కాకపోవడంతో స్టూడెంట్లంతా కలసి గూడూరు చివర నుంచి బస్టాండ్​ సెంటర్​ వరకు ర్యాలీ తీసి హైవేపై ధర్నా చేశారు. కలెక్టర్ వచ్చి సమస్య పరిష్కరించే వరకు ఆపేది లేదని గంటకు పైగా రోడ్డుపై బైఠాయించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఎంఈవో  శ్రీదేవి స్టూడెంట్లతో మాట్లాడి టీచర్లను కేటాయిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.