నాగార్జునసాగర్లో అల్లు అర్జున్.. భారీ సంఖ్యలో వచ్చిన ఫ్యాన్స్

నాగార్జునసాగర్లో అల్లు అర్జున్..  భారీ సంఖ్యలో వచ్చిన ఫ్యాన్స్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 2023 ఆగస్టు 19న నల్గొండ జిల్లా  నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పర్యటించారు.  చింతపల్లిలో ఆయన మామయ్య కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించిన పంక్షన్ హాల్ ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి బన్నీ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. దీంతో తమ అభిమాన హీరోను చూసేందుకు  అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.   అభిమానులను అదుపు చేయలేక పోలీసులు చాలా ఇబ్బందిపడ్డారు.  ఈ సందర్భంగా అభిమానులకు, జిల్లా పోలీసులకు బన్నీ ధన్యవాదాలు తెలిపారు.  ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ నేతలు ఎవరూ కూడా హాజరు కాలేదు.  

నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి టికెట్ కోసం ప్రయత్నిస్తున్న బీఆర్ఎస్ నేత కంచర్ల చంద్రశేఖర్​రెడ్డి.  పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల భగత్​కు వ్యతిరేకంగా చక్రం తిప్పుతున్న ఆయన.. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా టికెట్ సాధించాలనే లక్ష్యంతో బలప్రదర్శనకు దిగుతున్నారు. 2014 ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 

 కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి సీనియర్ నేత జానారెడ్డికి అత్యంత సన్నిహితుడు. గతంలో మిర్యాలగూడ, నల్గొండ ఎంపీ టికెట్​ఆశించినా రాలేదు. దీంతో కేసీఆర్ ఆహ్వానం మేరకు బీఆర్ఎస్ లో చేరిన కంచర్ల 2014లో ఇబ్రహీంపట్నం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2018లో టికెట్ రాకపోవడంతో ఈ సారి సొంత నియోజకవర్గం సాగర్​లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. తాను టికెట్​ ఆశిస్తున్న సంగతి హైకమాండ్ దృష్టిలో పడేలా సాగర్​లో పార్టీ కార్యకర్తలు, నాయకులతో తరచూ భేటీ అవుతున్నారు. రాజకీయంగా ఇది తనకు  చివరి అవకాశంగా భావిస్తున్న కంచర్లకు తన అల్లుడు అల్లు అర్జున్​సినీ గ్లామర్​తోడవుతుందని భావిస్తున్నారు.