హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్టులో ఎబోలా కలకలం రేగింది. సూడాన్ దేశం నుంచి వచ్చిన ఒక ప్రయాణికుడిలో ఎబోలా వైరస్ లక్షణాలను అధికారులు గుర్తించారు. ఎయిర్పోర్టులో హెల్త్ స్క్రీనింగ్ పరీక్షల్లో భాగంగా... థర్మల్ స్కానర్ ద్వారా ఈ విషయాన్ని కనుగొన్నారు.బాధితుడిని సూడాన్ దేశానికి చెందిన మొహమ్మద్ గా అధికారులు గుర్తించారు. ఎబోలా హిస్టరీ ఉన్న దేశం నుంచి అతను రావడంతో.. ఎయిర్పోర్ట్ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు.
గాంధీ ఆసుపత్రికి తరలింపు
ఎబోలా లక్షణాలు ఉన్న ప్రయాణికుడిని వెంటనే ప్రత్యేక అంబులెన్స్లో సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక ఐసోలేషన్ వార్డులో అతనికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. అంతేకాదు, అతనికి ఎబోలా సోకిందా లేదా అని నిర్ధారించుకోవడానికి శాంపిల్స్ సేకరించి, అత్యవసరంగా పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV) ల్యాబ్కు పంపించారు.
ఆందోళన వద్దు
ఈ ఘటనతో ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. శంషాబాద్ ఎయిర్పోర్టులో హెల్త్ స్క్రీనింగ్ పక్కాగా కొనసాగుతోందని.. పరిస్థితి పూర్తిగా అధికారుల నియంత్రణలోనే ఉందని వెల్లడించింది. విదేశాల నుండి వచ్చే ప్రతి ప్రయాణికుడిని నిశితంగా పరిశీలిస్తున్నామని.. ప్రజలు భయపడకుండా, అప్రమత్తంగా ఉంటే చాలని అధికారులు భరోసా ఇస్తున్నారు.
