
సుల్తానాబాద్, వెలుగు: పేకాటకు బానిసై అప్పులపాలై చివరకు దొంగగా మారిన ఓ స్టూడెంట్ను పోలీసులు అరెస్టు చేశారు. సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల గ్రామ శివారులోని మామిడితోట వద్ద రోడ్డుపై మామిడి పండ్లు అమ్ముతున్న రామినేని రమ్య మెడలోంచి బైక్పై వచ్చిన ఓ యువకుడు 2 తులాల బంగారు పుస్తెలతాడును ఎత్తుకెళ్లాడు. గత నెల 28న ఈ ఘటన జరిగింది. దీనికంటే ముందు పెద్దపల్లిలోనూ ఓ మహిళ మెడలో నుంచి కూడా చైన్ను లాక్కొని వెళ్లాడు.
పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా చైన్ స్నాచింగ్ చేసిన యువకుడి గురించి ఆరా తీయగా.. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం పచ్చనూరు గ్రామానికి చెందిన కాల్వ రాజు(21)గా గుర్తించారు. ఇతను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతూ పేకాటకు అలవాటు పడి దాదాపు రూ. 1లక్ష వరకు అప్పు చేశాడని, వీటిని తీర్చేందుకు చోరీలు చేస్తున్నాడని ఎస్ఐ శ్రావణ్ కుమార్ వెల్లడించారు. అతడిని సోమవారం సుల్తానాబాద్ మండలం కొమండ్లపల్లిలో అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు ఎస్ఐ చెప్పారు.