- గూగుల్ పెద్ద క్యాంపస్కు శంకుస్థాపన
- 33 లక్షల చదరపు అడుగుల్లో ఏర్పాటు
- అమెరికా బయట కంపెనీకిదే పెద్ద ఆఫీసు
హైదరాబాద్, వెలుగు:గూగుల్ హైదరాబాద్లో 7.3 ఎకరాల విస్తీర్ణంలో అతి పెద్ద ఆఫీసు కడుతోంది. అమెరికాలోని మౌంట్ వ్యూ ఆఫీసు తర్వాత రెండో పెద్ద ఆఫీసు ఇదే కానుంది. ఈ క్యాంపస్ భూమి పూజను గురువారం నాడు తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే టీ రామారావు చేశారు. 33 లక్షల చదరపు అడుగుల పెద్ద క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నందుకు గూగుల్కు కేటీఆర్ కృతజ్ఞతలు చెప్పారు. గచ్చిబౌలి వద్ద కొత్త క్యాంపస్ ఏర్పాటు కానుంది. 2019లోనే ఈ స్థలాన్ని గూగుల్ తీసుకుంది. గూగుల్ కట్టబోయే బిల్డింగ్ డిజైన్ను కూడా కేటీఆర్ లాంఛ్ చేశారు .
రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ..
రాష్ట్రంలోని యువత, మహిళా ఎంట్రప్రెనూర్లకు డిజిటల్ ఎకానమీని చేరువ చేసేందుకు ఈ సందర్భంగా గూగుల్, రాష్ట్ర ప్రభుత్వం ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. కేటీఆర్ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, గూగుల్ అధికారులు ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని యువతకు గూగుల్ కెరీర్ సర్టిఫికెట్ల కోసం స్కాలర్షిప్పులను అందిస్తారు. మహిళా ఎంట్రప్రెనూర్లకు డిజిటల్, బిజినెస్, ఫైనాన్షియల్ స్కిల్స్లో ట్రెయినింగ్నూ గూగుల్ అందిస్తుంది. స్కూళ్ల మోడర్నైజేషన్ ప్రాజెక్టులోనూ రాష్ట్ర ప్రభుత్వానికి గూగుల్ అండగా నిలుస్తుంది. స్కూళ్లకు డిజిటల్ టీచింగ్, లెర్నింగ్ టూల్స్, సొల్యూషన్స్ను గూగుల్ అందించనుంది.
వ్యవసాయంలోనూ ..
పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ మెరుగుపరిచేందుకు తెలంగాణ ప్రభుత్వానికి సాయపడతామని కూడా గూగుల్ ప్రకటించింది. వ్యవసాయం రంగం కోసమూ డిజిటల్ టెక్నాలజీలను అందుబాటులో ఉంచుతామని పేర్కొంది. గూగుల్తో చాలా ఏళ్లుగా తమ బంధం బలపడుతూ వస్తోందని చెబుతూ, ఇది సంతోషకరమైనదని ఐటీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి గూగుల్ మొదటి నుంచీ సపోర్ట్ అందిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో టెక్నాలజీ, ఐటీ సెక్టార్ డెవలప్మెంట్లో గూగుల్ పాత్ర కూడా ఉందని చెప్పారు. తమకు హైదరాబాద్లోనే ఎక్కువ మంది ఉద్యోగులున్నారని గూగుల్ కంట్రీ హెడ్, వైస్ప్రెసిడెంట్ సంజయ్ గుప్తా చెప్పారు.