ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి సిఫార్సు

ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి సిఫార్సు

కేంద్రానికి సుప్రీం కొలీజియం సిఫార్సు

హైదరాబాద్, వెలుగు : తెలంగాణ హైకోర్టుకు ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి సుప్రీంకోర్టు చీఫ్‌‌ జస్టిస్‌‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఆరుగురినీ న్యాయవాదుల కోటా నుంచే భర్తీకి సిఫార్సు చేసింది. అడ్వొకేట్లు ఏనుగుల వెంకట వేణుగోపాల్, నాగేశ్​భీమపాక, పుల్లా కార్తీక్‌‌ అలియాస్‌‌ పి.ఎలమందర్, కాజా శరత్, శ్రీనివాసరావు, నామవరపు రాజేశ్వర్‌‌రావుకు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలని కొలీజియం నిర్ణయించింది. ఈ సిఫార్సులపై రాష్ట్రపతి ఆమోదముద్ర వేయాల్సి ఉంది. కాగా, సీజేఐగా జస్టిస్​ ఎన్వీ రమణ బాధ్యతలు తీసుకున్న తర్వాత తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 24 నుంచి 42 కు పెంచారు. ప్రస్తుతం రాష్ట్ర హైకోర్టులో 27 మంది జడ్జీలు విధులు నిర్వహిస్తున్నారు. కొత్త వాళ్లు కూడా వస్తే జడ్జీల సంఖ్య 33కి చేరుతుంది.

వెంకట వేణుగోపాల్

ఈయన కరీంనగర్ జిల్లా మంకమ్మతోటలో 1967 ఆగస్టు 16న పుట్టారు. ఈయన తండ్రి రాజేశ్వర్‌రావు హ్యాండ్‌లూమ్స్‌ ఇండస్ట్రీస్‌లో డిప్యూటీ డైరెక్టర్‌గా, తల్లి బాలాకుమారి టీచర్‌ గా చేసి రిటైర్‌ అయ్యారు. ఉస్మానియా వర్సిటీలో లా చదివారు. 1992లో లాయర్‌గా ఎన్‌ రోల్‌ అయ్యాక  కరీంనగర్‌ కోర్టులో ప్రాక్టీస్‌ మొ దలుపెట్టారు. సీనియర్‌ అడ్వొకేట్‌ రాం జెఠ్మలానీ దగ్గర జూనియర్‌గా పనిచేశారు.  కేంద్ర ప్రభుత్వం తరఫున హైకోర్టులో వాదించారు.  రైల్వే స్టాండింగ్‌ కౌన్సిల్‌గా చేశారు. 2021లో సీనియర్‌గా ప్రమోషన్‌ పొందారు. అన్ని రకాల కేసులు వాదించారు.

భీమపాక నాగేశ్​

ఈయన 1969, మార్చి 8న భద్రాచలంలో పుట్టారు. తండ్రి భూపతిరావు ఫ్రీడమ్‌ ఫైటర్‌, మాజీ ఎమ్మెల్యే. తల్లి శాంతమ్మ. భద్రాచలంలోనే పాఠశాల విద్య పూర్తి చేశారు. ఖమ్మంలో ఇం టర్, ఎల్‌ఎల్‌బీని  సీఆర్‌ రెడ్డి కాలేజీలో, ఎల్‌ఎల్‌ఎంను హైదరాబాద్‌లోని నిజాం కాలేజీలో అభ్యసించారు. 1993లో అడ్వొకేట్​గా నమోద య్యారు. గవర్నమెంట్‌ అసిస్టెంట్‌ ప్లీడర్‌గా,  జీహెచ్‌ఎంసీ స్టాండింగ్‌ కౌన్సిల్‌గా, ఇండస్ట్రీస్‌ జీపీగా సేవలందించారు. 

పుల్లా కార్తీక్‌ 

ఈయన 1967, జూన్‌ 4న జగిత్యాలలో పోచమల్లమ్మ, ఒగ్గు హనుమంతులకు జన్మించారు. జగిత్యాలలో ప్రాథమిక విద్య, ఉస్మానియా ఆర్ట్స్‌ కాలేజీలో డిగ్రీ, పీజీ, ఓయూలో లా, ఎల్‌ఎల్‌ఎం చదివారు. 1996లో అడ్వొకేట్‌గా ఎన్‌రోల్‌ అయ్యారు. 2015లో ఏపీ పరిపాలన ట్రైబ్యునల్‌ జీపీగా చేశారు. 2017 నుంచి గవర్నమెంట్‌ జీపీగా పనిచేస్తున్నారు.


కాజా శరత్
ఈయ న1971, జనవరి 29న భద్రాచలంలో లలితాంబ, సీతారామయ్యలకు జన్మించారు. డిగ్రీ వరకు అక్కడే చదివారు. ఏయూ నుంచి లా, ఓయూ నుంచి ఎంఏ, ఎల్‌ఎల్‌ఎం పూర్తిచేశారు. 1997లో అడ్వొకేట్​గా ఎన్‌రోల్‌ అయ్యారు. కొత్తగూడెం, భద్రాచలం కోర్టుల్లో ప్రాక్టీస్‌ మొదలుపెట్టారు. 2002 నుంచి హైకోర్టులో వాదిస్తున్నారు.  

జె.శ్రీనివాస్‌ రావు 

ఈయన 1969, ఆగస్టు 31న రాజన్న సిరిసిల్ల జిల్లా, గంభీరావుపేట మండలం లింగన్నపేటలో మాణిక్యరావు, లక్ష్మీబాయిలకు జన్మించారు. అదే జిల్లాలో ఇంటర్‌ పూర్తిచేశారు. న్యూ సైన్స్‌ కాలేజీలో డిగ్రీ చదివారు. ఓయూలో బీఏ, ఎల్‌ఎల్‌బీ చేశారు. 1999లో అడ్వొకేట్​గా ఎన్‌రోల్‌ అయ్యారు. 2015 నుంచి సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌లో స్టాండింగ్‌ కౌన్సిల్‌గా పనిచేస్తున్నారు.

నామవరపు రాజేశ్వర్‌రావు 

ఈయన 1969, జూన్‌ 30న  మహబూబాబాద్‌ జిల్లా సుదన్‌పల్లిలో గిరిజాకుమారి, సత్యనారాయణరావులకు జన్మించారు. వరంగల్‌ సరస్వతీ శిశు మందిర్‌లో పాఠశాల విద్య, గోవిందరావుపేటలో ఇంటర్, మహబూబాబాద్‌లో డిగ్రీ చేశారు. హైదరాబాద్‌ పెండేకంటిలో లా పూర్తిచేశారు. 2001లో అడ్వొకేట్​గా ఎన్‌రోల్‌ చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తరఫున వివిధ సంస్థలకు న్యాయవాదిగా పనిచేశారు. 2019 నవంబర్‌ నుంచి అసిస్టెంట్‌ సొలిసిటర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.