విజయ్ మాల్యాకు కోర్టు షాక్.. నువ్వు ఆర్థిక నేరగాడివే..

విజయ్ మాల్యాకు కోర్టు షాక్.. నువ్వు ఆర్థిక నేరగాడివే..

విజయ్ మాల్యాకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడిగా ప్రకటించాలన్న పిటీషన్ కు కౌంటర్ గా.. విజయ్ మాల్యా దాఖలు చేసిన పిటీషన్ ను కొట్టివేసింది కోర్టు. పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడిగా పరిగణిస్తూ.. తన ఆస్తులను వేలం వేయటాన్ని సవాల్ చేస్తూ పిటీషన్ దాఖలు చేశారు మాల్యా. దీనిపై విచారణ చేసిన అత్యున్నత న్యాయ స్థానం.. మాల్యా దాఖలు చేసిన పిటీషన్ ను కొట్టివేసింది. ప్రభుత్వం, ఆర్థిక సంస్థలను చర్యలను సమర్థించింది కోర్టు. బ్యాంకులకు చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించకుండా విదేశాలకు వెళ్లటాన్ని ఏమంటారంటూ మాల్యా తరపు న్యాయవాదులను ప్రశ్నించింది కోర్టు. 

తన క్లయింట్స్ తో సన్నిహితంగా లేకపోవటం, వారి నుంచి ఎలాంటి సూచనలు, సలహాలు స్వీకరించకపోవటం వల్ల ఇలాంటి పరిణామాలు ఎదుర్కొంటున్నారని.. చెల్లించాల్సిన డబ్బును చెల్లిస్తామని.. ఆస్తుల వేలం నిలిపివేయాలని కోర్టును కోరారు విజయ్ మాల్యా తరపు లాయర్. అయితే కోర్టు ఈ వాదనను అంగీకరించలేదు. పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడిగా ప్రభుత్వం, ఆర్థిక సంస్థలు అభిప్రాయంతో ఏకీభిస్తూ.. విజయ్ మాల్యా పిటీషన్ ను కొట్టివేసింది కోర్టు. 
 
2016, మార్చిలో ఇంగ్లాండ్ పారిపోయిన మాల్యా.. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కింద అనేక బ్యాంకుల నుంచి 9 వేల కోట్ల రూపాయల అప్పు తీసుకున్నారు. వాటిని చెల్లించటంలో విఫలం అయ్యారు. బ్యాంకుల నుంచి ఒత్తిడి రావటం.. అరెస్ట్ అవుతారనే వార్తల క్రమంలోనే.. ఆయన రాత్రికి రాత్రి ఇండియా నుంచి ఇంగ్లాండ్ పారిపోయారు. అప్పటి నుంచి ఇండియా తిరిగి రాలేదు. బ్యాంకులకు చెల్లించాల్సిన అప్పు కూడా కట్టలేదు. ఈ క్రమంలోనే.. పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడిగా గుర్తించింది ప్రభుత్వం. దీన్ని సవాల్ చేస్తూనే మాల్యా పిటీషన్ దాఖలు చేశారు. దాన్ని కొట్టివేసింది కోర్టు. మాల్యాను ఇండియా తీసుకురావటానికి దౌత్యపరమైన చర్చలు కూడా జరుపుతుంది ప్రభుత్వం. లండన్ లోని కోర్టులో కేసు కూడా నడుస్తుంది. ఇంగ్లాండ్ చట్టాల ప్రకారం.. అందులోని లొసుగుల ఆధారంగా మాల్యా ఎప్పటికప్పుడు తప్పించుకుంటూ ఉన్నాడు.