న్యూఢిల్లీ: దేశ రాజధానిలో పెరుగుతున్న కాలుష్యం కారణంగా సుప్రీం కోర్టు విచారణలన్నీ వర్చువల్(ఆన్లైన్) మోడ్కు మార్చే అవకాశం ఉందని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. తాను బుధవారం మార్నింగ్ వాక్కు వెళ్లిన సమయంలో అస్వస్థతకు గురయ్యానని వెల్లడించారు. తమిళనాడు, కేరళ, బెంగాల్లో ఎన్నికల కమిషనల్ చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా(సర్) సవరణపై దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా సీజేఐ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఎలక్షన్ కమిషన్ తరఫున హాజరైన లాయర్ రాకేశ్ ద్వివేది కూడా తాను వాకింగ్కు వెళ్లినప్పుడు పొల్యూషన్ కారణంగా ఇబ్బందిపడ్డానని, ఛాతీ బరువెక్కిందని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తదుపరి విచారణకు హాజరయ్యేందుకు అనుమతి కోరారు. దీనికి స్పందించిన చీఫ్ జస్టిస్.. ‘నిన్న ఒక గంట నడిచిన తర్వాత నేను కూడా అస్వస్థతకు గురయ్యా’ అని చెప్పారు.
ఈ సందర్భంగా 60 ఏండ్లు దాటిన న్యాయవాదులకు ఫిజికల్ హాజరు నుంచి మినహాయింపు ఇవ్వడంపైనా చర్చ జరిగింది. పొల్యూషన్ కారణంగా లాయర్లు, పిటిషనర్లు పడుతున్న ఇబ్బందులను పరిగణలోకి తీసుకుంటామని సీజేఐ సూర్యకాంత్ అన్నారు. బార్ అసోసియేషన్ సభ్యులతో చర్చించి నిర్ణయం తీస్కుంటామని చెప్పారు.
